పండుగ పూట విషాదం
ABN , Publish Date - Jan 16 , 2025 | 12:12 AM
వెల్దుర్తి పట్టణం సమీపంలోని ఎనహెచ-44 రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో పట్టణానికి చెందిన గిరిచరణ్ (10) అక్కడికక్కడే మృతి చెందాడు.

వెల్దుర్తిలో కారు ఢీకొని బాలుడి మృతి
గాలిపటం ఎగురవేయడానికి హైవేకి వెళ్లి వస్తుండగా ఘటన
వెల్దుర్తి టౌన, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): వెల్దుర్తి పట్టణం సమీపంలోని ఎనహెచ-44 రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో పట్టణానికి చెందిన గిరిచరణ్ (10) అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాలివీ.. పట్టణంలోని ఇంద్రానగర్ చెందిన బోయ వెంకటేశ్వర్లు, కళ్యాణి దంపతులు మూడో కుమారుడు గిరిచరణ్ వెల్దుర్తి పట్టణంలోని ప్రైవేటు పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. సంక్రాంతి సెలవులు కావడంతో హైవే సమీపంలో తన పెదనాన్న నిర్వహిస్తున్న వాటర్ సర్వీసింగ్ సెంటరు వద్ద బుధవారం ఉదయం తోటి స్నేహితులతో గాలిపతంగులు ఎగురవేసేందుకు వెళ్లాడు. తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో హైవే దాటుతుండగా.. కర్నూలు నుంచి డోన వైపు వెళ్తున్న ఓ కారు ఆ బాలుడుని ఢీకొట్టింది. దీంతో ఎగిరిపడ్డ గిరిచరణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వెల్దుర్తి ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం చెందిన తమిళనాడు హోసూరు చెందిన కారుగా గుర్తించామని, కారు డ్రైవరు దేవేంద్రనను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ అశోక్ కుమార్ తెలిపారు.