Jagan liquor Scandal: అది విషమే
ABN , Publish Date - Jul 23 , 2025 | 04:17 AM
చట్టబద్ధమైన హెచ్చరిక... ‘మద్యపానం హానికరం!ప్రయోగశాలల్లో పరీక్షించి మరీ చేసిన హెచ్చరిక... జగన్ హయాంలో విక్రయించిన మద్యం విషంతో సమానం. ఇది మరింత ప్రమాదకరం!ఔను నిజం!
అత్యంత హానికరంగా ‘జే బ్రాండ్’ మద్యం
2022లోనే ధ్రువీకరించిన చెన్నై ల్యాబ్
నరాలు, రక్త ప్రసరణ, చర్మంపై దుష్ప్రభావం
అయినా పట్టించుకోని జగన్ సర్కార్
మద్యంతో సొమ్ము చేసుకోవడమే లక్ష్యం
మరీ నాసిరకంగా తయారైన చీప్ లిక్కర్
ప్రమాణాలు, నాణ్యతకు తిలోదకాలు
శుద్ధి చేయని ఈఎన్ఏతోనే తయారీ
నాటి ఆరోపణలు నిజమని ధ్రువీకరించిన వైద్య సేవ ట్రస్టు నివేదిక
‘‘ఈ మందు ఎంత తాగినా ఎక్కట్లేదురా! ఇంతకుముందు నైన్టీ తాగితే సరిపోయేది. కానీ, ఇప్పుడు క్వార్టర్ తాగినా పెద్దగా ఎక్కినట్లు అనిపించడం లేదు’
‘ఆ బ్రాండ్ ఏదో తేడాగా ఉంది మామా. తాగిన వెంటనే ఎక్కుతుంది. కొద్దిసేపటికే దిగిపోతుంది. దీంతో మళ్ళీ సీసా కొనక తప్పట్లేదు’
- గత ప్రభుత్వంలో మందుబాబుల మధ్య తరచూ ఇలాంటి చర్చలే జరిగేవి. చీప్ లిక్కర్ తాగే వాళ్లు చుక్క పడగానే తిక్కతిక్కగా మాట్లాడటం సహజం. కానీ... జే బ్రాండ్లు తాగాక వారి ప్రవర్తన ఇంకా చిత్రంగా మారిపోయేది. ఎందుకంటే... వాళ్లు తాగింది మద్యం కాదు! నెమ్మదిగా మనిషిని చంపే విషం!
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
చట్టబద్ధమైన హెచ్చరిక... ‘మద్యపానం హానికరం’!ప్రయోగశాలల్లో పరీక్షించి మరీ చేసిన హెచ్చరిక... ‘జగన్ హయాంలో విక్రయించిన మద్యం విషంతో సమానం. ఇది మరింత ప్రమాదకరం!’ఔను నిజం! జగన్ హయాంలో విక్రయించిన చీప్ లిక్కర్తో మత్తెక్కడం సంగతి అటుంచితే కిడ్నీలు, లివర్లు దెబ్బతినడం, నాడీవ్యవస్థ బలహీనం కావడం ఖాయమని 2022లోనే స్పష్టమైంది. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు రూపొందించిన నివేదికతో... అది నిజమని ఇప్పుడు రుజువైంది. అప్పట్లో వైసీపీ రెబల్ ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు... జగన్ హయాంలో విక్రయించిన బ్రాండ్లపై అనుమానంతో చెన్నైలోని ఎస్జీఎస్ ల్యాబ్స్లో పరీక్షలు చేయించారు. వాటిలో ప్రమాదకర రసాయనాలున్నాయని ఈ పరీక్షల్లో తేలింది. ఆ మద్యం తాగడం వల్ల కలిగే దుష్పరిణామాలను సవివరంగా నివేదికలో పొందుపరిచారు. అయితే... నాటి ప్రభుత్వం ఆ రిపోర్టు తప్పు అని దానిని మార్చేలా ఎస్జీఎస్ ల్యాబ్స్పై ఒత్తిడి చేసింది. విషయం పెద్దది కాకుండా ఆ నివేదిక మార్చాలని ఎస్జీఎస్ ల్యాబ్స్పై ఒత్తిడి చేసింది. అధికారం చేతిలో ఉండటంతో బలవంతంగా నివేదికలో మార్పులు చేయించింది!
ఆరోపణలను తొక్కిపెట్టారు..
జగన్ హయాంలో మద్యం తేడాగా ఉందని, మరీ నాసిరకం సరుకు విక్రయిస్తున్నారని అప్పటికే జనం గ్రహించారు. మరీ అలవాటుగా రోజూ తాగే వాళ్లను మినహాయిస్తే... ఎప్పుడో ఒకసారి మద్యం సేవించే ‘సోషల్ డ్రింకర్స్’ ఏపీ మద్యాన్ని దూరం పెట్టేశారు. అదే సమయంలో ఎస్జీఎస్ ల్యాబ్స్ నివేదిక వెల్లడైంది. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ అప్పుడే ప్రత్యేక కథనం ప్రచురించింది. అన్ని ఆరోపణలు వచ్చినా నాటి జగన్ సర్కారు పట్టించుకోలేదు. అడ్డగోలుగా అదే మద్యం అమ్మకాలు కొనసాగించింది. దీంతో ‘జే’ బ్రాండ్లు తాగిన అనేక మంది అనారోగ్యం పాలయ్యారు. కొంతమంది ప్రాణాలూ కోల్పోయారు.
ఆ బ్రాండ్లపై అనేక అనుమానాలు..
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అనేక కొత్త బ్రాండ్లు వచ్చాయి. అంతకుముందు ఎప్పుడూ వినని లోకల్ బ్రాండ్లను తెరపైకి తెచ్చారు. వాటిలో ఎక్కువ బ్రాండ్లు ప్రమాణాలు పాటించలేదు. తక్కువ కాలంలో ఎక్కువ మద్యం సరఫరా చేసే క్రమంలో నాణ్యత, ప్రమాణాలను గాలికొదిలేశారు. దీర్ఘకాలం మద్యం వ్యాపారం చేయాలి, మార్కెట్లో విశ్వసనీయతను కాపాడుకోవాలి, వినియోగదారుల ఆదరణ పొందాలి... ఇలాంటి ఉద్దేశాలేవీ లేకపోవడం, తక్కువకాలంలోనే ఎక్కువ సంపాదించాలనే అత్యాశతో ప్రమాణాలను అస్సలు పట్టించుకోలేదు. అనుమతి వచ్చీరాగానే లక్షల కేసుల మద్యాన్ని ఆ కంపెనీలు సరఫరా చేశాయి. అంత తక్కువ కాలంలో ఆ స్థాయిలో మద్యం ఎలా తయారుచేశారు? తక్కువ సమయంలో పరీక్షలు నిర్వహించారా? అనే అనేక అనుమానాలూ ఉన్నాయి.
అదే ధరకు నాణ్యమైన మద్యం..
వాస్తవానికి జే బ్రాండ్లకు ప్రభుత్వం అడ్డగోలుగా ధరలు పెంచింది. కేసు ధర రూ.700 నుంచి రూ.వెయ్యి దాటింది. సొంత బ్రాండ్లు కావడంతో ధరలు పెంచుకుని ఇష్టారాజ్యంగా అమ్ముకున్నారు. అయితే, అదే ధరకు ప్రభుత్వానికి మద్యం సరఫరా చేసిన పాపులర్ బ్రాండ్ల కంపెనీలు నాణ్యమైన మద్యాన్నే సరఫరా చేశాయి. ఒక కేసులో 48 క్వార్టర్ సీసాలుంటాయి. కేసుకు రూ.700.. అంటే ఒక్కో సీసా ఉత్పత్తికి రూ.15 అవుతోంది. అందులోనే ఆ కంపెనీ లాభాలు, ఖర్చులు అన్నీ ఉంటాయి. అదే సీసాను పన్నులు కలిపి ప్రభుత్వం రూ.150 నుంచి రూ.200 వరకు అమ్ముతుంది. అయితే, జే బ్రాండ్లకు ఒక్కో సీసాకు రూ.20 వరకు చెల్లించారు. అంటే ఒక్క సీసాపైనే రూ.5 అదనం! అంటే కోట్ల సీసాలపై ఎంత మేర దోచిపెట్టారో అర్థంచేసుకోవచ్చు. క్వార్టర్ సీసాపై రూ.10 కూడా ఖర్చు చేయకుండా ప్రభుత్వం నుంచి రూ.20 తీసుకున్నారు. అదే ధర మాకు కూడా ఇవ్వాలని పాపులర్ బ్రాండ్లు కోరితే నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు.
‘జులాయి’ చిత్రం..
‘అరేయ్.. బిట్టూ! రుషికొండ నుంచి భీమిలి వెళ్లే మలుపులో ఓ బిట్టుంది. అక్కడ కూర్చుంటే విశాఖపట్నం మొత్తం మన కాళ్లకింద ఉన్నట్లు ఉంటుంది. అక్కడ కూర్చోవాలంటే పవర్ ఉండాలి. అది కావాలంటే కనీసం వెయ్యి కోట్లు ఉండాలి. వెళ్లి తెచ్చేయ్’ అని కోటా శ్రీనివాసరావు చెబుతాడు. బిట్టూ బ్యాంకు దోపిడీకి బయలు దేరగానే.. ఆ బృందంలోని యువతి సైగలతో.. ‘ఎనిమిది మందిని ఎంపిక చేసుకో.. ఒకరితో ఒకరికి సంబంధం ఉండ కూడదు.. నువ్వు ప్లాన్ చేస్తున్నావని తెలియ కూడదు..’ అని సూచించడంతో విలన్ ఎనిమిది మంది యువకులను పోగేసి, బ్యాంకు దోపిడీ చేస్తాడు! ఇది... ‘జులాయి’ సినిమా! జగన్ హయాంలో జరిగిన ‘మద్యం దోపిడీ’ని కూడా ఇదే కథతో పోల్చుతూ సోషల్ మీడియాలో వీడియోలు ప్రత్యక్షమవుతున్నాయి. అదెలాగంటే...
‘‘రుషికొండపై ప్యాలెస్ కట్టుకుని కూర్చుంటే విశాఖపట్నం మొత్తం మన కాళ్ల కింద ఉన్నట్లు ఉంటుంది.. అక్కడ కూర్చోవాలంటే మనకు మళ్లీ మళ్లీ పవర్ దక్కాలి. దాని కోసం వేల కోట్లు కావాలి. ప్రతి నెలా లిక్కర్ నుంచి 60కోట్లు కమీషన్లు వచ్చేలా ప్లాన్ చెయ్!’’ అని జగన్ ఏ1 రాజ్ కసిరెడ్డిని ఆదేశిస్తారు. ఇక... సినిమాలో విలన్ 8 మందిని పోగేసుకున్నట్లుగా రాజ్ కసిరెడ్డి టెక్కలి, విశాఖపట్నం, అమలాపురం, కాకినాడ, తిరుపతి, శ్రీకాళహస్తి, హైదరాబాద్కు చెందిన 8 మందిని యువకుల్ని పోగేసి ‘టీమ్’ తయారు చేసి లిక్కర్ స్కామ్ అమలు చేస్తాడు. ఇదీ సంగతి. సినిమాలో బిట్టూ ఆటను హీరో కట్టించేస్తాడు. ఇక్కడ... లిక్కర్ ముఠా గుట్టును ‘సిట్’ లాగేస్తోంది.
ఇలా తయారు చేయాలి..
మద్యం ఉత్పత్తిలో ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్(ఈఎన్ఏ) కీలకం. ఇందుకోసం తొలుత రెక్టిఫైడ్ స్పిరిట్(ఆర్ఎస్) తయారుచేస్తారు. చీప్, మీడియం రకాల బ్రాండ్లకు బియ్యం నూకతోనే ఈఎన్ఏ తయారవుతుంది. మొదట ఆర్ఎస్ తయారుచేస్తారు. ఆర్ఎ్సలో 50శాతం దాటి ఆల్కహాల్ ఉండాలి. దానిని మరింత శుద్ధిచేసి 68శాతానికిపైగా ప్యూరిటీ వస్తే దానిని ఈఎన్ఏ అంటారు. అప్పుడే మద్యం తయారుచేయాలి. ఈఎన్ఏకు ఆ బ్రాండ్ ఫ్లేవర్, రంగు, నీరు కలిపి బాటిలింగ్ చేస్తారు. ఒక్కో మద్యం బాటిల్లో 42.2శాతం ఆల్కహాల్ ఉంటే, మిగిలింది నీరు ఉంటుంది. అయితే... ఆర్ఎ్సను 68శాతం వరకు శుద్ధి చేయకపోతే ఆ మద్యం ప్రమాదకరంగా మారుతుంది. పూర్తిగా శుద్ధి చేయకుండానే ఈఎన్ఏగా భావిస్తే అందులో మలినాలు, ఇతరత్రా రసాయనాలు మిగిలిపోతాయి. అవి మానవ శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి.
ఈఎన్ఏ అంత వాడలేదా?
ఒక కేసు మద్యం తయారీకి నాలుగు లీటర్ల ఈఎన్ఏ వినియోగించాలి. జే బ్రాండ్లలో అంత ఈఎన్ఏ వాడలేదనేది ప్రధాన ఆరోపణ. అందుకే ఆ బ్రాండ్లు తాగినా సరిగా మత్తు ఎక్కలేదని, కిక్కు కోసం మరింత ఎక్కువ మద్యం తాగేవారని మద్యం తయారీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఆర్ఎ్సను పూర్తిగా శుద్ధి చేయకుండా ఈఎన్ఏ తయారు చేయడం వల్ల త్వరగా మత్తు ఎక్కి, త్వరగా దిగిపోయే అవకాశమూ ఉందని అంటున్నారు.
ఇలా చేశారా?
డిస్టిలరీల్లో మద్యం తయారీకి ముందు ప్రతి బ్యాచ్లో మూడు సీసాలను ల్యాబ్స్కు పరీక్షలకు పంపాలి. అంతకుముందు మద్యం తయారీకి సిద్ధం చేసిన ద్రావణాన్ని 24గంటలు నిల్వ ఉంచాలి. కానీ, ఎక్కువ మద్యం సరఫరా చేసే ఆత్రుతలో ఈ నిబంధనలను పెద్దగా పట్టించుకోలేదని, కొన్నిసార్లు ల్యాబ్స్ నుంచి రిపోర్టులు రాకముందే బాటిలింగ్ చేయించారనే ఆరోపణలున్నాయి. ఫలితంగా ఆ మద్యం తాగిన తర్వాత పిచ్చిపిచ్చిగా అనిపించడం వంటి అనారోగ్య సమస్యలు పెరిగాయి.
అసలు నివేదిక ఏం చెప్పింది?
మద్యం అంటేనే ఆరోగ్యానికి హానికరం! కొన్ని ప్రతికూల అంశాలు కచ్చితంగా మద్యంలో ఉంటాయి. అయితే... జగన్ హయాంలో ప్రవేశపెట్టిన బ్రాండ్లలో, సాధారణ ప్రతికూలతను దాటి ఆందోళన కలిగించే అనేక అంశాలు బయటపడ్డాయి. ఆ మద్యం తాగితే తలెత్తే ప్రమాదాలపై ఎస్జీఎస్ తన నివేదికలో స్పష్టంగా వివరించింది. ‘‘జే-బ్రాండ్ మద్యం వల్ల చర్మం పైపొరల్లోని సన్నని నరాలు క్రమంగా బలహీనపడతాయి. దీర్ఘకాలంలో రక్త ప్రసరణపై ప్రభావం చూపుతుంది. మందు తాగిన 10 నుంచి 20 నిమిషాల వ్యవధిలో ఆయాసం వస్తుంది. మూత్ర సంబంధిత వ్యాధులు తలెత్తుతాయి’’ అని తెలిపింది.
బ్రాండ్ 1: ఇది దీర్ఘకాలిక విషపూరితం(స్లో పాయిజన్) లాంటిది. ఒక్కసారిగా శ్వాసక్రియ పెరుగుతుంది. బీపీ పడిపోతుంది. నాడీ వ్యవస్థ పనితీరు ఒక్కసారిగా వేగవంతమవుతుంది. తల తిరగడం, తలనొప్పి, కడుపు నొప్పి, వాంతులు, అతిసారం, మానసిక ఆందోళన, కళ్ల మంటలు, చర్మం దురద, లివర్ సంబంధిత వ్యాధులు వస్తాయి.
బ్రాండ్ 2: ఇది కూడా స్లో పాయిజన్. దగ్గు, గొంతు నొప్పి, చర్మం కందిపోవడం, కళ్లు ఎరుపెక్కడం, వాంతులు, అతిసారం, శ్వాసక్రియ పెరగడం, బీపీ పడిపోవడం, నాడీ వ్యవస్థ పనితీరు వేగవంతం కావడం లాంటి ప్రతికూల పరిణామాలు ఏర్పడతాయి. బ్రాండ్ 3, 4ల్లో కూడా ఇలాంటి అంశాలే ఉన్నాయి.
బ్రాండ్ 5: ఇది తీవ్రమైన విషపూరితం. చర్మానికి తాకితేనే చర్మ సంబంధిత వ్యాధులు వస్తాయి. దాని ఆవిరి పీల్చినా విషపూరిత ప్రమాదం అవుతుంది. దగ్గు, గొంతునొప్పి, వాంతులు, అతిసారం లాంటి సమస్యలూ తలెత్తుతాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
భక్తులకు అలర్ట్.. టీటీడీ కీలక నిర్ణయాలు
వేల కోట్ల భూములు.. ఖరీదైన విల్లాలు.. వెలుగులోకి మాజీ మంత్రి అనిల్ అక్రమాలు
For More AP News and Telugu News