Tiruvuru MLA : గీత దాటుతున్నారు... జాగ్రత్త
ABN , Publish Date - Jan 21 , 2025 | 07:05 AM
‘‘మీరు తరచూ వివాదాల్లో చిక్కుకొంటున్నారు. మిమ్మల్ని ఇప్పటికే రెండుసార్లు మా ముందుకు పిలవాల్సి వచ్చింది. మీ వ్యవహార శైలి పట్ల ముఖ్యమంత్రి కూడా అసంతృప్తితో ఉన్నారు. మీరు గీత దాటుతున్నారు....జాగ్రత్త’’ అని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే
కొలికపూడికి టీడీపీ క్రమశిక్షణ సంఘం హెచ్చరిక
తరచూ వివాదాల్లో చిక్కుకొంటున్నారు
మీ తీరు పట్ల సీఎం అసంతృప్తితో ఉన్నారు
అది మీకూ,పార్టీకీ మంచిది కాదు: సంఘ సభ్యులు
నాపై దుష్ప్రచారం జరుగుతోంది: టీడీపీ ఎమ్మెల్యే
అమరావతి, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): ‘‘మీరు తరచూ వివాదాల్లో చిక్కుకొంటున్నారు. మిమ్మల్ని ఇప్పటికే రెండుసార్లు మా ముందుకు పిలవాల్సి వచ్చింది. మీ వ్యవహార శైలి పట్ల ముఖ్యమంత్రి కూడా అసంతృప్తితో ఉన్నారు. మీరు గీత దాటుతున్నారు....జాగ్రత్త’’ అని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ సంఘం హెచ్చరించింది. సోమవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ క్రమ శిక్షణ సంఘం ముందు ఎమ్మెల్యే కొలికపూడి హాజరయ్యారు. క్రమ శిక్షణ సంఘం సభ్యులు వర్ల రామయ్య, ఎంఎ షరీఫ్, కొనకళ్ల నారాయణ, బీసీ జనార్దనరెడ్డి, పంచుమర్తి అనురాధ ఈ విచారణలో పాల్గొన్నారు. తిరువూరు నియోజకవర్గంలోని గోపాలపురం గ్రామంలో ఈ నెల పదకొండో తేదీన ఒక రోడ్డు వివాదంలో ఒక వ్యక్తిపై ఎమ్మెల్యే చేయి చేసుకొన్నారని, ఆ రోడ్డుపై ఉన్న కంచెను పీకివేశారని ఆరోపణలు వచ్చాయి. ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ ఆ వ్యక్తి భార్య పురుగులమందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశారని కూడా వార్తలు వచ్చాయి. ఎమ్మెల్యే తీరుపై అదే రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన ఆదేశంతో పార్టీ క్రమ శిక్షణ సంఘం కొలికపూడిని తమ ముందుకు పిలిచింది. టీడీపీ వర్గాల సమాచారం ప్రకారం, తాను ఏ తప్పూ చేయలేదని కొలికపూడి శ్రీనివాసరావు వాదించారు. ఆ మహిళ అసలు పురుగుల మందు తాగలేదని చెప్పారు. దీంతో క్రమశిక్షణ సంఘం సభ్యునిగా ఉన్న వర్ల రామయ్య అప్పటికప్పుడు పోలీసు అధికారులకు ఫోన్ చేసి ఏం జరిగిందో తెలుసుకొన్నారు. ఆ మహిళ పురుగులమందు తాగిన విషయం వాస్తవమేనని, కానీ తక్కువ పరిమాణంలో తాగడంతో ప్రమాదం నుంచి బయటపడిందని పోలీసు అధికారులు చెప్పారు. తాను న్యాయంగానే వ్యవహరించానని, ఏ తప్పూ చేయలేదని పేర్కొంటూ ఎమ్మెల్యే కొన్ని రుజువులు ఈ సంఘానికి అందచేశారు. తన వాదనను వివరిస్తూ ఒక లేఖను కూడా ఆయన సమర్పించారు. క్రమశిక్షణ సంఘం ఈ ఒక్క అంశానికే పరిమితం కాకుండా ఎమ్మెల్యే తరచూ వివాదాల్లో చిక్కుకుంటుండడాన్ని ప్రస్తావించింది. ‘‘మీరు బాధ్యత కలిగిన ఎమ్మెల్యే. తరచూ మిమ్మల్ని ఏదో ఒక వివాదం చుట్టుముడుతోంది. ఇది మీకూ... పార్టీకీ మంచిది కాదు. సామాజిక వర్గాల అంశాలను బహిరంగంగా ప్రస్తావించి విమర్శలు చేయడం... చట్టాన్ని చేతుల్లోకి తీసుకొనేలా ప్రవర్తించడం సరికాదు. మీ తీరు బాగోలేకపోవడం వల్లే క్రమశిక్షణ సంఘం ముందుకు వస్తున్నారు. ఈ పరిస్థితిని పదేపదే తెచ్చుకోవద్దు. గీత దాటవద్దు. క్రమశిక్షణ పాటించండి. అందరినీ కలుపుకొని పోండి. వివాదాల వల్ల మంచి పేరు రాదు. పనితీరు వల్ల వస్తుంది. ఈ విషయం గుర్తించండి’ అని సంఘం సభ్యులు ఆయనకు గట్టిగా చెప్పినట్లు సమాచారం.
వక్రీకరించి ప్రచారం చేశారు : కొలికపూడి
తన తప్పేమీ లేకపోయినా తనపై దుష్ప్రచారం జరుగుతోందని కొలికపూడి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. క్రమ శిక్షణ సంఘం ముందు హాజరైన తర్వాత ఆయన పార్టీ కార్యాలయం ఆవరణలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ‘‘వైసీపీకి చెందిన కొందరు వ్యక్తులు గ్రామం అంతా వాడుకోవాల్సిన సిమెంట్ రోడ్డుపై కంచె వేసి ఆటంకాలు సృష్టించారు. ఈ వ్యక్తులు గత రెండు ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన అభ్యర్థులపై దాడి చేశారు. ఒకసారి అధినేత చంద్రబాబు పర్యటనలో మంచినీళ్ల బాటిళ్లు విసిరారు. అటువంటి వ్యక్తులు అందరూ వాడుకోవాల్సిన రోడ్డుపై కంచె వేయడం సరికాదని, నేను దానిని తొలగించాను. ఆ రోడ్డు సమిష్టి వినియోగానికి సంబంధించిందని గ్రామ పంచాయతీ తీర్మానం కూడా ఉంది. కంచె వేసిన వ్యక్తి కూడా వార్డు సభ్యుని హోదాలో దానిపై సంతకం చేశారు’’ అని ఆయన చెప్పారు. ఎమ్మెల్యే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవచ్చా అన్న ప్రశ్నకు......తాను సదుద్దేశంతోనే ఆ పని చేశానని, కానీ సామాజిక మాధ్యమాల్లో తన చర్యను వక్రీకరిస్తూ ప్రచారం చేశారని ఆయన చెప్పారు. తాను ఈ సంఘటనలో తప్పేమీ చేయలేదని, అదే విషయం క్రమ శిక్షణ సంఘానికి చెప్పానన్నారు. పార్టీలో ఎవరైనా క్రమ శిక్షణ పాటించాల్సిందేనని, అదే విషయాన్ని ఎమ్మెల్యేకు చెప్పామని పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య పేర్కొన్నారు. ‘ఎమ్మెల్యే పార్టీ గీత దాటుతున్నారని అనిపిస్తోంది. ముఖ్యమంత్రి కూడా ఆయన తీరు పట్ల అసంతృప్తితో ఉన్నారు. అదే విషయం ఆయనకు చెప్పాం. ఈ ఏడు నెలల్లో రెండుసార్లు ఆయన క్రమ శిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. ఇటువంటి పరిస్థితి పదేపదే తెచ్చుకోవద్దని సూచించాం. ఆయన కూడా అంగీకరించారు’’ అని రామయ్య వివరించారు. తమ నివేదికను పార్టీ అధిష్ఠానానికి వివరిస్తామని ఆయన తెలిపారు. వైసీపీ వాళ్లు కంచె వేయడం వల్లే తాను తొలగించాల్సి వచ్చిందని ఎమ్మెల్యే చెప్పారని, జాగ్రత్తగా ఉండాలని ఆయనకు సూచించామని మరో సభ్యుడు, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ మీడియాకు తెలిపారు.