Share News

Anantapur Robbery: అనంతపురంలో ముసుగు దొంగల భారీ చోరీ

ABN , Publish Date - Jan 23 , 2025 | 04:40 AM

అనంతపురంలో ముసుగు దొంగలు భారీ ఎత్తున చోరీ చేశారు. నగర శివారులోని రాజహంస విల్లా్‌సలోని మూడు ఇళ్లల్లో నలుగురు దొంగలు చొరబడి భారీగా బంగారు ఆభరణాలు, నగదును దోచుకుపోయారు.

Anantapur Robbery: అనంతపురంలో ముసుగు దొంగల భారీ చోరీ

అనంతపురం క్రైం, జనవరి 22(ఆంధ్రజ్యోతి): అనంతపురంలో ముసుగు దొంగలు భారీ ఎత్తున చోరీ చేశారు. నగర శివారులోని రాజహంస విల్లా్‌సలోని మూడు ఇళ్లల్లో నలుగురు దొంగలు చొరబడి భారీగా బంగారు ఆభరణాలు, నగదును దోచుకుపోయారు. బుధవారం తెల్లవారు జామున 3.45 గంటల నుంచి 5 గంటల మధ్య ఇళ్లలో ఎవరూ లేని సమయంలో దొంగతనాలు జరిగాయి. వ్యవసాయం, రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేసే వెంకట శివారెడ్డి ఇంట్లోని బీరువాలో దాచిన రూ. 20 లక్షల నగదు, ప్రత్యేక లాకరులో ఉంచిన రూ. 3.50 కోట్ల విలువైన వజ్రాలు, బంగారు ఆభరణాలను దొంగలు ఎత్తుకుపోయారు. విద్యుత్‌ శాఖ డీఈ బోయపాటిశివశంకర్‌నాయుడు ఇంట్లో 4 తులాలు బంగారు ఆభరణాలు, కొంతమొత్తంలో వెండి సామగ్రి, రూ. 65 వేల నగదు ఎత్తుకెళ్లారు. ఆ పక్కనే రంజిత్‌ అనే వ్యక్తి ఇంట్లోనూ చోరీ జరిగింది. ఎంత చోరీ జరిగిందీ తెలియరాలేదు. అయితే రంజిత్‌ ఇంట్లో సీసీ కెమెరాలున్నాయి. పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. నలుగురు దుండగులు ముఖానికి ముసుగులు వేసుకుని దొంగతనాలకు పాల్పడినట్లు ఫుటేజీ ఆధారంగా నిర్ధారించారు. క్లూస్‌టీం, డాగ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. నాలుగో పట్టణ సీఐ సాయినాథ్‌ సిబ్బందితో కలిసి చోరీలు జరిగిన ఇళ్లను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jan 23 , 2025 | 04:40 AM