ఇదేం ‘పంచాయతీ’!
ABN , Publish Date - Mar 06 , 2025 | 12:40 AM
గ్రామ పంచాయతీల్లో వినియోగించే బ్లీచింగ్, సున్నం, వీధి దీపాల కొనుగోలు పాలకవర్గాలు, ఈవోలు, కార్యదర్శులకు పెద్ద సవాల్గా మారింది. 2017లో నిర్ణయించిన ధరలనే నేటికీ అమలు చేస్తుండటంతో పెరిగిన ధరలతో సామగ్రి కొనలేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఏటా మార్చిలో చేర్పులు, మార్పులు చేయాల్సి ఉన్నా ఆ దిశగా డీపీవోలు చర్యలు తీసుకోవడంలేదు. తక్కువ మొత్తాల్లో సామగ్రి కొని సర్దలేక, ఆడిట్ అభ్యంతరాలను ఎదుర్కోలేక ఇదేం ‘పంచాయతీ’ అంటూ ఉద్యోగులు తలలు పట్టుకుంటున్నారు.
- 8 ఏళ్ల క్రితం ధరలతో బ్లీచింగ్, సున్నం కొనుగోలుకు ఉత్తర్వులు
- నాడు బ్లీచింగ్ కిలో రూ.24.. నేడు రూ.45పైనే..
- 2017లో నిర్ణయించిన ధరలే నేటికీ అమలు
- ఏటా మార్చిలో మార్పులు చేయాల్సి ఉన్నా పట్టించుకోని డీపీవోలు
- తక్కువ మొత్తంలో సామగ్రి కొని సర్దలేక ఉద్యోగుల ఇక్కట్లు
గ్రామ పంచాయతీల్లో వినియోగించే బ్లీచింగ్, సున్నం, వీధి దీపాల కొనుగోలు పాలకవర్గాలు, ఈవోలు, కార్యదర్శులకు పెద్ద సవాల్గా మారింది. 2017లో నిర్ణయించిన ధరలనే నేటికీ అమలు చేస్తుండటంతో పెరిగిన ధరలతో సామగ్రి కొనలేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఏటా మార్చిలో చేర్పులు, మార్పులు చేయాల్సి ఉన్నా ఆ దిశగా డీపీవోలు చర్యలు తీసుకోవడంలేదు. తక్కువ మొత్తాల్లో సామగ్రి కొని సర్దలేక, ఆడిట్ అభ్యంతరాలను ఎదుర్కోలేక ఇదేం ‘పంచాయతీ’ అంటూ ఉద్యోగులు తలలు పట్టుకుంటున్నారు.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం:
జిల్లావ్యాప్తంగా 474 పంచాయతీలు ఉన్నాయి. ఈ పంచాయతీల్లో పారిశుద్ధ్య నిర్వహణ, వర్షాకాలం, ఇతర సీజన్లలో వ్యాధులు ప్రబలకుండా అన్ని చర్యలు తీసుకోవాలి. నిత్యం బ్లీచింగ్, సున్నం చల్లుతూనే ఉండాలి. వీటిని జిల్లా స్థాయి కమిటీ సూచించిన కంపెనీలు, వాటికి అనుబంధంగా స్థానికంగా ఉన్న డీలర్ల నుంచి పంచాయతీలు కొనుగోలు చేయాల్సి ఉంది. జిల్లా స్థాయి కమిటీలో సభ్యులుగా ఉన్న జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో), ఇతర అధికారులు వీటి ధరలను ఏటా మార్చిలో నిర్ణయించి, కమిటీ చైర్మన్గా ఉన్న జాయింట్ కలెక్టర్ ఆమోదంతో అనుమతులు ఇవ్వాలి. కానీ ఈ ప్రక్రియ 2017 నుంచి నిలిచిపోయింది. 2017లో పంచాయతీలకు సరఫరా చేసే బ్లీచింగ్ కిలో ధరను రూ.24గా నిర్ణయించారు. రాష్ట్రంలోని కర్నూల్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ర్టాల్లోని కంపెనీలకు జిల్లాలో అనుబంధంగా ఉన్న అధీకృత డీలర్ల నుంచి బ్లీచింగ్ కొనుగోలు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. విజయవాడ, గుడివాడ, మచిలీపట్నం డివిజన్లోని పంచాయతీలు ఏయే డీలర్ల నుంచి బ్లీచింగ్, సున్నం, వీధిలైట్లు, ఇతర సామగ్రిని కొనుగోలు చేయాలో నిర్ణయించారు. పంచాయతీలకు వచ్చిన బ్లీచింగ్, వీధిలైట్లు, ఇతర సామగ్రి నాణ్యతగా ఉందో లేదో పంచాయతీ సర్పంచ్లు పరిశీలించాలి. నిబంధనలకు అనుగుణంగా ఉంటే బిల్లులను డీడీలు, చెక్ల రూపంలో చెల్లించాలనే నిబంధన ఉంది. ఇంత వరకు బాగానే ఉన్నా 2017లో జారీ చేసిన ఉత్తర్వుల్లోని ధరలు నేటికీ అమలు కావడం గమనార్హం. 2017లో కిలో బ్లీచింగ్ రూ.24 ధర ఉండగా, ప్రస్తుతం రూ.42 నుంచి రూ.45 వరకు ధర పలుకుతోంది. గతంలో పంచాయతీల్లో వీధి దీపాలుగా ట్యూబ్లైట్లను వాడేవారు. ప్రస్తుతం వాటిస్థానంలో ఎల్ఈడీ బల్బులు వాడకంలోకి వచ్చాయి. ప్రస్తుతం ట్యూబ్లైట్లు కొనుగోలు చేయాలో, ఎల్ఈడీ బల్బులు కొనుగోలు చేయాలో తేల్చడం లేదు. పాత ఉత్తర్వులను సవరించకపోవడంతో పంచాయతీ పాలకవర్గాలు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని పంచాయతీ పాలకవర్గాలు అయితే తక్కువ మొత్తంలో బ్లీచింగ్, సున్నం, వీధిలైట్లను కొనుగోలు చేసి కొత్త ధరలకు సరిపడా లెక్కలు చూపాల్సినస్థితి నెలకొంది. గతంలో పంచాయతీల్లో వాల్యుయాడెడ్ ట్యాక్స్ అమలులో ఉండేది. ఈ పద్ధతి పోయి జీఎస్టీ అమలులోకి వచ్చింది. పంచాయతీల ద్వారా కొనుగోలు చేసే సామగ్రికి జీఎస్టీ అమలయ్యే అంశంలోనూ గందరగోళం నెలకొందని పంచాయతీ ఈవోలు, కార్యదర్శులు చెబుతున్నారు.
ఆడిట్ అభ్యంతరాలు
పంచాయతీల్లో ఏటా ఆడిట్ నిర్వహించే సమయంలో పంచాయతీల ద్వారా కొనుగోలు చేసే సామగ్రి విషయంలో ధరల్లో వ్యత్యాసంపై ఆడిట్ అఽధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. 2017లో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం కాకుండా అదనపు ధరలతో సున్నం బ్లీచింగ్, వీధిలైట్లు, ఇతరత్రా సామగ్రిని ఎలా కొనుగోలు చేశారని ఆడిట్ విభాగం అధికారులు అభ్యంతరాలు రాయడం గమనార్హం. ఈ రిపోర్టుల ఆధారంగా కొందరు వ్యక్తులు సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు కోరి పంచాయతీ పాలకవర్గాలను, ఉద్యోగులను ఇరుకునపెట్టే పనులకు పాల్పడుతున్నారని తెలిసింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఏడేళ్ల నాటి ఉత్తర్వులను సవరించి, ప్రస్తుతం అమలులో ఉన్న ధరలకు అనుగుణంగా పంచాయతీలు సామగ్రి కొనుగోలు చేసేలా కొత్త ఉత్తర్వులు ఇవ్వాలని పంచాయతీ పాలకవర్గ సభ్యులు, ఉద్యోగులు కోరుతున్నారు.