తగ్గేదే లే..
ABN , Publish Date - Feb 17 , 2025 | 01:01 AM
నగర శివారుల్లోని పాయకాపురం కండ్రిక కాలనీ సరిహద్దులో కార్పొరేషన్ స్థలాన్ని కబ్జా చేసిన వైసీపీ కబ్జా గ్యాంగ్ తగ్గేదే లే.. అంటోంది. కబ్జా వ్యవహారంపై అధికారులు చర్యలు చేపట్టకుండా ముందస్తుగానే కబ్జా చేసిన కార్పొరేషన్ స్థలాన్ని కోర్టు వివాదంలో ఉన్న ప్రైవేట్ స్ధలం వ్యవహారంగా చిత్రీకరించింది. అంతటితో ఆగకుండా అధికారులను భయపెట్టే విధంగా కబ్జా స్థలంలో ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేసి అధికారులు ప్రభుత్వ భూమిలో అడుగు పెట్టకుండా ఉండాలని కుయుక్తులు పన్నింది. అయితే టౌన్ప్లానింగ్ సిబ్బంది కబ్జా స్థలం వద్దకు వచ్చి ఆదివారం ఫ్లెక్సీలను తొలగించివేశారు. అదే సమయంలో కబ్జా గ్యాంగ్ వద్ద స్థలాలు కొని మోసపోయిన బాధితులు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు.

వైసీపీ కబ్జా గ్యాంగ్ తీరు ఇది
కబ్జా స్థలంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి అధికారులను భయపెట్టే ప్రయత్నం
కార్పొరేషన్ స్థలం కోర్టు వివాద స్థలంగా చిత్రీకరణ
ఫ్లెక్సీలను తొలగించిన టౌన్ప్లానింగ్ అధికారులు
స్థలాలు కొని మోసపోయిన బాధితుల ఆందోళన
కబ్జా గ్యాంగ్పై క్రిమినల్ చర్యలు తీసుకుని న్యాయం చేయాలని వేడుకోలు
నగర శివారుల్లోని పాయకాపురం కండ్రిక కాలనీ సరిహద్దులో కార్పొరేషన్ స్థలాన్ని కబ్జా చేసిన వైసీపీ కబ్జా గ్యాంగ్ తగ్గేదే లే.. అంటోంది. కబ్జా వ్యవహారంపై అధికారులు చర్యలు చేపట్టకుండా ముందస్తుగానే కబ్జా చేసిన కార్పొరేషన్ స్థలాన్ని కోర్టు వివాదంలో ఉన్న ప్రైవేట్ స్ధలం వ్యవహారంగా చిత్రీకరించింది. అంతటితో ఆగకుండా అధికారులను భయపెట్టే విధంగా కబ్జా స్థలంలో ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేసి అధికారులు ప్రభుత్వ భూమిలో అడుగు పెట్టకుండా ఉండాలని కుయుక్తులు పన్నింది. అయితే టౌన్ప్లానింగ్ సిబ్బంది కబ్జా స్థలం వద్దకు వచ్చి ఆదివారం ఫ్లెక్సీలను తొలగించివేశారు. అదే సమయంలో కబ్జా గ్యాంగ్ వద్ద స్థలాలు కొని మోసపోయిన బాధితులు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు.
పాయకాపురం/విజయవాడ రూరల్, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి) :
కండ్రిక కాలనీ సమీపంలోని ఆంధ్ర సిమెంట్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ అండ్ ఇండసి్ట్రయల్ వర్కర్స్ హౌస్ సొసైటీ లిమిటెడ్ వెంచర్కు ఆనుకుని ఉన్న కార్పొరేషన్కు చెందిన రూ.10 కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలం కబ్జాకు గురైన విషయమై ఆదివారం ‘కబ్జా గ్యాంగ్’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై అధికారుల కన్నా ముందే కబ్జా గ్యాంగ్ స్పందించింది. తెల్లవారు జామునే కబ్జా స్థలంలోకి చేరుకుని సదరు స్థలం కోర్టు వ్యవహారమని ఇతరులు ఎవరు స్థల వివాదంలో జోక్యం చేసుకోరాదంటూ పదుల సంఖ్యలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. ‘ఆంధ్రజ్యోతి’ కథనంపై స్పందించిన టౌన్ ప్లానింగ్ సిబ్బంది అక్కడికి వెళ్లి ఫ్లెక్సీలను చూసి కంగారు పడ్డారు. కోర్టు వ్యవహారంలో ఉన్న ప్రైవేట్ స్థలంగా కాసేపు భ్రమలో పడిపోయారు. అయితే పైఅధికారులను సంప్రదించగా అది కార్పొరేషన్కు చెందిన స్థలంగా నిర్థారించుకుని అనంతరం యాక్షన్లోకి దిగిపోయారు. కబ్జా భూముల్లో ఏర్పటు చేసిన ఫ్లెక్సీలను మొత్తం పూర్తిగా తొలగించారు.
సరిహద్దు రాళ్లను తొలగిస్తాం : బిల్డింగ్ ఇన్స్పెక్టర్
కార్పొరేషన్ భూమి కబ్జా విషయమై బిల్డింగ్ ఇన్స్పెక్టర్ సునీత స్పందించారు. ఆదివారం ఫ్లెక్సీలను సిబ్బందితో తొలగింపజేసిన ఆమె సదరు స్థలం కార్పొరేషన్ స్థలంగా ధ్రువీకరించారు. అలాగే ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేసిన సరిహద్దు రాళ్లను సోమవారం తొలగించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
బాధితుల ఆందోళన
కార్పొరేషన్ స్థలాన్ని సిమెంట్ ఫ్యాక్టరీ అసోసియేషన్కు చెందిన స్థలంగా భావించి స్థలాలు కొనుగోలు చేసి కబ్జా గ్యాంగ్ చేతుల్లో మోసపోయిన బాధితులు ఆదివారం రోడ్డెక్కారు. కబ్జా భూముల వద్దకు చేరుకుని తాము మోసపోయామంటూ గగ్గోలు పెట్టారు. తమను నమ్మించి నట్టేట ముంచేశారని, తాము దాచుకున్న డబ్బుతో కొన్న స్థలాలు ప్రభుత్వ స్థలాలని తెలియడంతో వారంతా బోరుమంటున్నారు. రెండేళ్ల కిందటే తక్కువ ధరలకు వస్తున్నాయని స్థలాలు కొన్నామని ఇలా మోసపోతామని గ్రహించలేకపోయామని, తమకు స్థలం అమ్మిన వ్యక్తులపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు.
ఎమ్మెల్సీ అనుచరుడే కీలకం
కబ్జా వ్యవహారంలో ఎమ్మెల్సీ అనుచరుడు, వైసీపీ సానుభూతిపరుడు బండారు దుర్గారావు కీలకంగా వ్యవహరించినట్లు బయటపడింది. ఆదివారం రోడ్డెక్కిన బాధితులు బండారు దుర్గారావు తమకు సిమెంట్ ఫ్యాక్టరీ అసోసియేషన్ స్థలంగా నమ్మబలికి అమ్మినట్లు బాధితులు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా 2021లోనే కార్పొరేషన్ స్థలాన్ని కబ్జా చేసి 36 ప్లాట్లుగా విడగొట్టి నకిలీ పత్రాలు సృష్టించినట్లు తేలింది. మొత్తం రూ.10 కోట్లు విలువ చేసే 4000 గజాల స్థలానికి పక్కనే ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీ అసోసియేషన్ సర్వే నంబరు డాక్యుమెంట్ల ద్వారా నకిలీ డాక్యుమెంట్లు సృష్టించినట్లు స్పష్టమవుతుంది.