Andaman and Nicobar Islands: అండమాన్లో టీడీపీకి మరో విజయం
ABN , Publish Date - Apr 25 , 2025 | 04:28 AM
టీడీపీ-బీజేపీ కూటమి అండమాన్-నికోబార్ దీవుల్లో మరొక ఘన విజయాన్ని సాధించింది. శ్రీవిజయపురం మున్సిపల్ కౌన్సిల్ చైర్పర్సన్గా టీడీపీ అభ్యర్థి షాహుల్ హమీద్ విజయం సాధించారు.
శ్రీవిజయపురం మున్సిపల్ కౌన్సిల్ కైవసం
చైర్మన్గా షాహుల్ హమీద్ ఎన్నిక.. సీఎం చంద్రబాబు హర్షం
అమరావతి, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): అండమాన్ నికోబార్ దీవుల్లో కూటమి ప్రభుత్వం మరో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. దక్షిణ అండమాన్లోని శ్రీవిజయపురం మున్సిపల్ కౌన్సిల్(ఎ్సవీపీఎంసీ) చైర్పర్సన్గా టీడీపీకి చెందిన ఎస్.షాహుల్ హమీద్ ఎన్నికయ్యారు. ఆయన టీడీపీ-బీజేపీ కూటమి అభ్యర్థిగా పోటీచేశారు. గురువారం జరిగిన ఎన్నికలో మొత్తం 24 ఓట్లకు గాను 15 ఓట్లు సాధించి.. ప్రస్తుత చైర్పర్సన్, కాంగ్రెస్ అభ్యర్థి సుదీప్ రాయ్ శర్మను ఓడించారు. ఈ విజయంతో అండ్మాన్-నికోబార్ దీవుల్లో రెండో పట్టణాన్ని కూడా టీడీపీ గెలుచుకున్నట్లయింది. అంతకుముందు పోర్టు బ్లెయిర్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని టీడీపీకి చెందిన మహిళా కార్పొరేటర్ సెల్వి చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు, అండమాన్ ఇన్చార్జి వి.మాధవనాయుడు శ్రీవిజయపురంలోనే ఉండి ఎన్నికల సన్నాహాలను పర్యవేక్షించారు. ఈ విజయం.. టీడీపీ-బీజేపీ కూటమిపై ప్రజల నమ్మకానికి నిదర్శనమని అండమాన్, నికోబార్ దీవుల టీడీపీ అధ్యక్షుడు ఎన్.మాణిక్యరావ్ యాదవ్ అన్నారు. హమీద్ ఎన్నికపై టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏదైనా ప్రజాసంక్షేమమే ఎజెండాగా టీడీపీ పనిచేస్తుందన్నారు. ఈ విజయాన్ని అందించిన అండమాన్ ప్రజలకు ఆయన ఓ ప్రకటనలో ధన్యవాదాలు తెలియజేశారు.
Also Read:
ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..
లామినేషన్ మిషన్ను ఇలా వాడేశాడేంటీ...
ప్రధాని నివాసంలో కీలక సమావేశం..
For More Andhra Pradesh News and Telugu News..