Fraud : ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేశారు
ABN , Publish Date - Jan 23 , 2025 | 04:57 AM
ఉద్యోగాలు, రుణాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకుని, మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు టీడీపీ గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతల అండతో భూ కబ్జాలకు పాల్పడిన వారిపైనా విచారణ జరపాలని మరికొందరు విజ్ఞప్తి చేశారు. బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో
టీడీపీ గ్రీవెన్స్లో బాధితుల ఫిర్యాదులు
అమరావతి, జనవరి 22(ఆంధ్రజ్యోతి): ఉద్యోగాలు, రుణాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకుని, మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు టీడీపీ గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతల అండతో భూ కబ్జాలకు పాల్పడిన వారిపైనా విచారణ జరపాలని మరికొందరు విజ్ఞప్తి చేశారు. బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి పార్థసారథి అర్జీలు స్వీకరించారు. కృష్ణా జిల్లా ఉత్తర చిరువోలులంకకు చెందిన ఉప్పాల అనిల్కుమార్ ‘మోర్ల మహీధర్... మాజీ మంత్రి జోగి రమేశ్కు అత్యంత సన్నిహితుడు. గృహ నిర్మాణ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని భరోసా ఇచ్చాడు. రూ.16 లక్షలు తీసుకుని, మోసం చేశాడు. దీనిపై పోలీసులను ఆశ్రయిస్తే కేసు తీసుకోలేదు’ అని వాపోయారు. భీమవరం కలెక్టరేట్లో పనిచేస్తున్న ఆదినారాయణరెడ్డి ఉద్యోగం ఇప్పిస్తానని రూ.9.50 లక్షలు తీసుకుని, మోసం చేశారని తాడేపల్లికి చెందిన కేఎస్ ప్రియ ఫిర్యాదు చేశారు. ‘వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అనుచరుడు వర్రా సాగర్రెడ్డి బ్యాం క్లో పనిచేస్తున్నానని చెప్పి నమ్మించాడు. లోన్ ఇప్పిస్తానని నా ఖాతాలోని సొమ్ము కాజేశాడు’ అని గుంటూరుకు చెందిన గంజరపల్లి చిన్నయ్య ఫిర్యాదు చేశారు.