ప్రజాసేవే నాకు పెద్ద పదవి: వర్మ
ABN , Publish Date - Mar 11 , 2025 | 06:32 AM
చంద్రబాబుతో నా ప్రయాణం 23 ఏళ్లు.. ఇన్నేళ్లుగా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సేవ చేసుకునే అవకాశం కల్పించారు..

చంద్రబాబుతో 23 ఏళ్లుగా ప్రయాణం.. ఆయన, లోకేశ్ ఆదేశాలు శిరోధార్యం
పిఠాపురం, మార్చి 10(ఆంధ్రజ్యోతి): ‘టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుతో నా ప్రయాణం 23 ఏళ్లు.. ఇన్నేళ్లుగా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సేవ చేసుకునే అవకాశం కల్పించారు.. నాకు ఇదే పెద్ద పదవి. ఇంతకంటే ఎక్కువ ఏం ఉంటుంది’ అని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ అన్నారు. ఎమ్మెల్సీ పదవి ఆయనకు రాకపోకవడంతో కాకినాడ జిల్లా పిఠాపురంలోని టీడీపీ కార్యాలయానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు సోమవారం భారీగా తరలివచ్చారు. ఆయన వారితో మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నా.. లేకున్నా టీడీపీ కుటుంబంతో కలిసి ఎన్నో పోరాటాలు చేశామన్నారు. తాను, తన కుటుంబం, పిఠాపురం నియోజకవర్గ టీడీపీ కుటుంబం ఎల్లప్పుడూ చంద్రబాబు, భవిష్యత్ రథసారథి లోకేశ్ ఆదేశాలు, నిర్ణయాలను శిరసావహిస్తామని తెలిపారు. గ్రామ, మండల స్థాయిలోనే చిన్న పదవి ఇవ్వాలంటే ఎన్నో ఆలోచిస్తామని, అటువంటిది రాష్ట్ర స్థాయిలో పదవులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఎన్నో ఇబ్బందులు ఉంటాయని, వాటిని మనం అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానించారు.