ఎంపీడీవో ఆఫీసు ఎదుట వైసీపీ నాయకుడి చిందులు
ABN , Publish Date - Oct 14 , 2025 | 12:02 AM
Argument between the two sides సరుబుజ్జిలి ఎంపీడీవో కార్యాలయం ఎదుట సోమవారం ఓ వైసీపీ నాయకుడు చిందులు వేశారు. టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులను దుర్భాషలాడారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఆ సమయంలో ఎమ్మెల్యే రవికుమార్ కూడా అక్కడే ఉన్నారు.
టీడీపీ నాయకులను ఉద్దేశించి దుర్భాషలాడిన వైనం
ఇరువర్గాల మధ్య వాగ్వాదం.. పోలీసుల జోక్యం
సరుబుజ్జిలి, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): సరుబుజ్జిలి ఎంపీడీవో కార్యాలయం ఎదుట సోమవారం ఓ వైసీపీ నాయకుడు చిందులు వేశారు. టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులను దుర్భాషలాడారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఆ సమయంలో ఎమ్మెల్యే రవికుమార్ కూడా అక్కడే ఉన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే కూన రవికుమార్ అధికారులతో సమావేశమయ్యారు. గ్రామ సచివాలయ భవనాలు, ఆర్ఎస్కే భవనాలు పూర్తి చేయాలని పీఆర్ ఏఈ కూర్మనాధరావును ఆదేశించారు. ఇసుకలపాలెం పంచాయతీలో అసంపూర్తిగా ఉన్న భవనాలను సర్పంచ్ పల్లి సురేష్ ద్వారా నిర్మాణాలు చేపడితే బాగుంటుందని ఏఈ ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వచ్చారు. గతంలో ఆ భవన నిర్మాణాలు చేపట్టిన వైసీపీ నాయకుడు బద్రి రామారావు గ్రామ పంచాయతీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉందని సర్పంచ్ సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వ్యక్తిని స్థానిక మండల పరిషత్ కార్యాలయంతో పాటు వివిధ శాఖల అధికారులు ప్రత్యేకంగా కూర్చోబెట్టుకుని కాలం గడుపుతున్నారని ఫిర్యాదు చేశారు. సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఎమ్మెల్యే రవికుమార్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యం ఫిర్యాదులతో అభివృద్ధిని అడ్డుకుంటున్న వైసీపీ నాయకుడు బద్రి రామారావును ప్రోత్సహించిన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో సమీపంలో ఉన్న వైసీపీ నాయకుడు బద్రి రామారావు చిందులు వేశారు. అక్కడే ఉన్న టీడీపీ నాయకులపై నోరు పారేసుకున్నారు. ఎమ్మెల్యేని ఉద్దేశించి కూడా ‘బయటకు రా’ అన్నారు. దీంతో టీడీపీ నాయకులు, వైసీపీ నాయకుడి మధ్య తోపులాట జిగింది. ఎమ్మెల్యే కూడా సదరు వైసీపీ నాయకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఐ హైమవతి సిబ్బందితో వచ్చి ఇరువర్గాలను అదుపు చేశారు.