Share News

postel scam: అమ్మో.. పోస్టల్‌!

ABN , Publish Date - Jul 26 , 2025 | 11:35 PM

Financial fraud Postal department ఇచ్ఛాపురంలోని పోస్టాఫీసులో రూ.2.86 కోట్ల కుంభకోణం శుక్రవారం వెలుగులోకి రావడంతో.. తపాలాశాఖపై ఖాతాదారుల్లో నమ్మకం సన్నగిల్లుతోంది. ఆర్థిక, పొదుపు సేవలకు నమ్మకమైన తపాలాశాఖలో కూడా అక్రమాలు చోటుచేసుకోవడం చర్చనీయాంశమవుతోంది.

postel scam: అమ్మో.. పోస్టల్‌!
పోస్టల్‌ కార్యాలయంలో బాధితుల ఖాతాలను పరిశీలిస్తున్న అధికారులు

  • కొందరు సిబ్బంది తీరుతో చిన్నబోతున్న తపాలాశాఖ

  • ఇచ్ఛాపురంలో రూ.2.86 కోట్ల కుంభకోణంపై అంతటా చర్చ

  • కొనసాగుతున్న విచారణ

  • ఇచ్ఛాపురం, జూలై 26(ఆంధ్రజ్యోతి): ఇచ్ఛాపురంలోని పోస్టాఫీసులో రూ.2.86 కోట్ల కుంభకోణం శుక్రవారం వెలుగులోకి రావడంతో.. తపాలాశాఖపై ఖాతాదారుల్లో నమ్మకం సన్నగిల్లుతోంది. ఆర్థిక, పొదుపు సేవలకు నమ్మకమైన తపాలాశాఖలో కూడా అక్రమాలు చోటుచేసుకోవడం చర్చనీయాంశమవుతోంది. పోస్టల్‌ శాఖలో కొంతమంది సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తుండడం ఖాతాదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇచ్ఛాపురంలో పోస్టల్‌ సిబ్బంది పాత్రతో ఈ స్కామ్‌ జరిగిందని అధికారుల విచారణలో తేలగా ఇప్పటికే ఐదుగురిని సస్పెండ్‌ చేశారు. దీనిపై మరింత విచారణ చేపడుతున్నారు. శనివారం కూడా సోంపేట, పలాస పోస్టల్‌ డివిజనల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.శ్రీకాంత్‌, శ్రీకాకుళం పోస్టల్‌ డివిజనల్‌ ఇన్‌స్పెక్టర్‌ కమల్‌హాసన్‌ ఇచ్ఛాపురంలో పోస్టల్‌ కార్యాలయంలో రికార్డులు తనిఖీ చేశారు. ఖాతాదారుల వద్ద ఉన్న కిసాన్‌ వికాస్‌ పత్రాలు (కేవీపీ) బాండ్లను పరిశీలించారు. కొంతమంది ఖాతాల్లో డబ్బులు లేకపోవడంతో వారి నుంచి క్లయిమ్స్‌ తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా చాలామంది ఖాతాదారులు పోస్టల్‌ కార్యాలయానికి చేరుకుని.. లబోదిబోమంటున్నారు. పోస్టల్‌లో సైతం డబ్బులు దాచుకోవడానికి భయపడాల్సిన దుస్థితి నెలకొం దని వాపోతున్నారు.

  • ఇచ్ఛాపురానికి చెందిన ఓ వ్యక్తి 2016లో తన పిల్లల పేర్లు మీద రూ.11 లక్షలు కేవీపీ బాండ్లుపై డిపాజిట్‌ చేశారు. వారి ఖాతాల నుంచి డబ్బులు డ్రా చేసినట్టు ఉంది. దీంతో ఆ వ్యక్తి ఆందోళన చెందుతున్నారు.

  • ఖజానా వీధికి చెందిన బి.మహాలక్ష్మి, బి.ఢిల్లమ్మ గతేడాది కేవీపీ బాండ్లుపై రూ.3లక్షలు డిపాజిట్‌ చేశారు. శనివారం వారి ఖాతాను పరిశీలించగా.. డబ్బులు డ్రా చేసినట్టు ఉండడంతో వారు లబోదిబోమన్నారు.

  • ..ఇలా చాలామంది ఖాతాదారులు పోస్టల్‌ కార్యాలయం వద్దకు చేరుకుని తమ ఖాతాల్లో డబ్బులు ఉన్నాయో లేదోనని తనిఖీ చేయిస్తున్నారు. కొంతమంది ఖాతాలు ఖాళీగా కనిపిస్తుండడంతో కలవరపడుతున్నారు. కూలి చేసుకుని.. పిల్లల భవిష్యత్‌, ఆర్థిక అవసరాల కోసం డబ్బులు దాచుకున్నామని, తమ డబ్బులు తమకు ఇప్పించేలా చూడాలని పోస్టల్‌ అధికారులను వేడుకుంటున్నారు. కాగా ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సోంపేట, పలాస పోస్టల్‌ డివిజనల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.శ్రీకాంత్‌ తెలిపారు. ఈ కేసు సీబీఐకి అప్పగించామని, త్వరలోనే బాధ్యులందరికీ పట్టుకుని సొమ్ము రికవరీ చేస్తామన్నారు. ఖాతాదారులకు సకాలంలో ఆ డబ్బులు అందేలా చర్యలు చేపడతామన్నారు.

Updated Date - Jul 26 , 2025 | 11:35 PM