ఎవరు కోటీశ్వరులు?
ABN , Publish Date - Oct 11 , 2025 | 11:46 PM
Rs. 1 crore for excellence in development గ్రామాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. పంచాయతీలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు వీలుగా స్వచ్ఛత అవార్డుల పేరిట నజరానా ప్రకటించాయి. తొమ్మిది అంశాల్లో పురోగతి సాధించిన పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం రూ.కోటి ఇవ్వనుంది.
అభివృద్ధిలో ప్రత్యేకత చాటితే రూ.కోటి
గ్రామ పంచాయతీలకు కేంద్రం నజరానా
తొమ్మిది అంశాలలో పరిశీలన
కోటబొమ్మాళి, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): గ్రామాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. పంచాయతీలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు వీలుగా స్వచ్ఛత అవార్డుల పేరిట నజరానా ప్రకటించాయి. తొమ్మిది అంశాల్లో పురోగతి సాధించిన పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం రూ.కోటి ఇవ్వనుంది. పంచాయతీల్లో ఏయే అంశాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలో ఇప్పటికే ప్రకటించింది. ఈ భారీ ప్రోత్సాహకాన్ని పంచాయతీలు పొందేందుకు వీలుగా సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులకు ప్రభుత్వం శిక్షణ ఇవ్వనుంది. జిల్లాలో 912 పంచాయతీలున్నాయి. వీటిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్శాఖలు ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేశాయి. స్థానిక అవసరాలు, భౌగోళిక అంశాలకు తగ్గట్టుగా ప్రత్యేకతను చాటుకోవడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన తొమ్మిది అంశాలను పరిగణనలోనికి తీసుకుని పంచాయతీలకు పురస్కారాలు ప్రకటించనున్నారు. పంచాయతీలను ప్రగతిపఽథంలో నడిపించేందుకు జిల్లా పంచాయతీ అధికారి సైతం మండలాల్లో ఈఓపీఆర్డీలకు ఆదేశాలిస్తూ అమలుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రభుత్వ మార్గనిర్దేశకాల మేరకు పంచాయతీల్లో చేపట్టిన అభివృద్ధిని డాక్యుమెంటరీ రూపంలో చిత్రీకరించి జిల్లా పంచాయతీ అధికారికి అందజేయాలి. వీటిని డీపీవో కార్యాలయం అధికారులు పరిశీలించి.. ఉత్తమమైనవి ఎంపిక చేసి ప్రభుత్వానికి నివేదిస్తారు. కేంద్ర, రాష్టస్థాయిల్లో అధికారులు డిసెంబరులో పురోగతి సూచిక ప్రగతిని గుర్తించి.. ప్రోత్సాహకానికి ఎంపికైన పంచాయతీలను ప్రకటిస్తారు. ఆయా పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం రూ.కోటి నజరానా అందజేస్తుంది.
తొమ్మిది అంశాలివే..
గ్రామ పంచాయతీలో పేదరికం లేని జీవనోపాధిని పెంపొందించడం
ప్రజా ఆరోగ్యం, శ్రేయస్సును మెరుగుపరిచే కార్యక్రమాలు నిర్వహించడం
పిల్లల సంరక్షణ, అభివృద్ధికి అనుకూలమైన వాతావరణం సృష్టించడం
ప్రజలకు స్వచ్ఛమైన నీటిని పుష్కలంగా అందుబాటులోకి తేవడం
గ్రామాన్ని పరిశుభ్రంగా, పచ్చదనంగా ఉంచడం
మౌలిక సదుపాయాల అభివృద్ధి
గ్రామంలో సామాజిక న్యాయాన్ని సురక్షిత వాతావరణంలో నెలకొల్పడం
శాంతియుతమైన, న్యాయమైన, బలమైన సంస్థలతో సుపరిపాలన
పంచాయతీ సమగ్ర అభివృద్ధి, మౌళిక సదుపాయాలు, విద్య, ఆరోగ్యం తదితర అంశాలు.
పురోగతి సాధించేలా..
పంచాయతీలను అభివృద్ధి చేయడంతోపాటు ఆహ్లాదరకరమైన వాతావరణం నెలకొల్పేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛత అవార్డులు ప్రకటించాయి. తొమ్మిది అంశాలను ప్రాతిపదికగా తీసుకుని పురోగతి సాధించిన పంచాయతీలను ఎంపిక చేస్తారు. నిర్దేశించిన అంశాలవారీగా అభివృద్ధి జరిగిన పంచాయతీలు డాక్కుమెంటరీ తీసి మా కార్యాలయానికి పంపించాలి. వాటిని పరిశీలించి, నిబంధనలకు అనుకూలంగా ఉన్న డాక్యుమెంటరీలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తాం.
- భారతిసౌజన్య, జిల్లా పంచాయతీ అధికారి