Share News

ఎరువులు ఎప్పుడిస్తారు?

ABN , Publish Date - Aug 19 , 2025 | 11:56 PM

: రైతులకు ఎరువులు ఎప్పుడు ఇస్తారంటూ మండల సర్వసభ్య సమావేశంలో పలువురు సభ్యులు అధికారులను నిలదీశారు.

 ఎరువులు ఎప్పుడిస్తారు?
మాట్లాడుతున్న సభ్యులు

-అధికారులను నిలదీసిన సభ్యులు

- వాడీవేడిగా మండల సమావేశం

పాతపట్నం, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): రైతులకు ఎరువులు ఎప్పుడు ఇస్తారంటూ మండల సర్వసభ్య సమావేశంలో పలువురు సభ్యులు అధికారులను నిలదీశారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ దొర సావిత్రమ్మ అధ్యక్షతన మంగళవారం సర్వసభ్య సమావేశం వాడీవేడిగా జరిగింది. ఎంపీటీసీ కొండాల యరకయ్య, జడ్పీటీసీ లింగాల ఉషారాణి, తూలుగు ప్రవీణ్‌, పోలాకి రేణుక తదితరులు మాట్లాడుతూ.. యూరియా అందక రైతు లు ఇబ్బందులు పడుతున్నా రని అన్నారు. ఎరువులను సరఫరా చేయడంలో వ్యవ సాయాధికారులు వైఫల్యం చెందారని పేర్కొన్నారు. ఏవో కిరణ్‌వాణి మాట్లాడుతూ.. ‘మండలంలో 15,600ఎకరాల్లో వరిసాగవుతుంది. దీనికి 700 మెట్రిక్‌ టన్నుల యూరియా, 700 మెట్రిక్‌టన్నుల డీఏపీ, 519 మెట్రిక్‌టన్నుల పొటాష్‌ అవసరం ఉంటుంది. ఇప్పటి వరకు రైతులకు 370 మెట్రిక్‌ టన్నుల యూరియా, 80 మెట్రిక్‌ టన్నుల డీఏపీని రైతు సేవాల కేంద్రాల ద్వారా అందించాం. రెండు, మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో ఎరువులు వస్తాయి. వచ్చిన వెంటనే రైతు లకు సరఫరా చేస్తాం’అని తెలిపారు. మేజర్‌ పంచాయతీ పాతపట్నంలో శ్మశానవాటిక నిర్మాణాల పనులు ఒక్కటైనా జరగలేదంటూ పలువురు సభ్యులు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ఏపీవోను నిలదీశారు. పలు వీధుల్లో విద్యుత్‌ స్తంభాలను మార్చాలని విద్యుత్‌శాఖ అధికారులను కోరారు. సోమవారం రాత్రి కురిసిన వర్షాలకు రిజర్వు ఫారెస్ట్‌కు ఆనుకొని ఉన్న ట్రెంచ్‌లు కొట్టేయడంతో సూర్యనారాయణపురం గ్రామంలోని ఇళ్లలోకి నీరుచేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని సభ్యులు వివరించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికా రుల దృష్టికి తీసుకెళతామని అటవీ శాఖాఅధికారి అజయ్‌ తెలిపారు. ఈ సమావేశంలో తహసీల్దార్‌ నందిగామ ప్రసాదరావు, మండలప్రత్యేకాధికారి మంచు కరుణాకరరావు, ఎంపీడీవో పి.చంద్రకుమారి, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 19 , 2025 | 11:56 PM