certificates Verification : ప్రశాంతంగా..
ABN , Publish Date - Aug 28 , 2025 | 11:27 PM
DSC candidates certificates observation మెగా డీఎస్సీ మెరిట్ లిస్ట్ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన గురువారం ప్రశాంతంగా ప్రారంభమైంది. శ్రీకాకుళం మహాలక్ష్మినగర్లో సమగ్రశిక్ష ఎఫ్.ఎల్.ఎన్ శిక్షణ కార్యాలయంలో ఈ ప్రక్రియ నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 543 మంది అభ్యర్థులకుగానూ గురువారం 403 మంది ధ్రువపత్రాల పరిశీలన పూర్తయింది.
డీఎస్సీ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన
తొమ్మిది కమిటీలతో నిర్వహణ
నేడూ కొనసాగనున్న ప్రక్రియ
అరసవల్లి, ఆగస్టు 28(ఆంద్రజ్యోతి): మెగా డీఎస్సీ మెరిట్ లిస్ట్ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన గురువారం ప్రశాంతంగా ప్రారంభమైంది. శ్రీకాకుళం మహాలక్ష్మినగర్లో సమగ్రశిక్ష ఎఫ్.ఎల్.ఎన్ శిక్షణ కార్యాలయంలో ఈ ప్రక్రియ నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 543 మంది అభ్యర్థులకుగానూ గురువారం 403 మంది ధ్రువపత్రాల పరిశీలన పూర్తయింది. జిల్లానలుమూలల నుంచి అభ్యర్థులు ఉదయం 9 గంటలకే హాజరుకాగా 11 గంటలకు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు ఇబ్బందులు పడకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. తొమ్మిది బృందాలుగా ఏర్పడి ధ్రువపత్రాలను పరిశీలించారు. ఒక్కో టీమ్లో ఎంఈవో, ప్రధానోపాధ్యాయుడు, డిప్యూటీ తహసీల్దారు, ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నారు. వీరితోపాటు జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్ష సిబ్బంది, పీడీలను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేశారు. అభ్యర్థులకు టోకెన్లు జారీ చేసి.. గందరగోళం లేకుండా సర్టిఫికెట్లను పరిశీలన చేపట్టారు. సాయంత్రం 4 గంటల వరకు ప్రక్రియ కొనసాగడంతో కొంతమంది అభ్యర్థులు ఆకలితో ఇబ్బందులు పడ్డారు. డీఈవో రవిబాబు నిరంతరం కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ ఎటువంటి సందేహాలున్నా నివృత్తి చేశారు. సాంకేతిక సమస్యలున్న అభ్యర్థుల విషయంలో డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారిని ఫోను ద్వారా సంప్రదించి మరీ పరిష్కారాలను సూచించారు. నిబంధనల మేరకు 403 మంది అభర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిందని, మిగిలిన 140 మంది ధ్రువపత్రాలను శుక్రవారం పరిశీలిస్తామని డీఈవో రవిబాబు తెలిపారు. అభ్యర్థులకు కాల్లెటర్స్ కూడా అందజేస్తామన్నారు.