అదుపు తప్పి.. డివైడర్ అవతలికి దూసుకెళ్లిన వ్యాన్
ABN , Publish Date - Jul 11 , 2025 | 12:30 AM
రణస్థలం వద్ద జేఆర్పురం పోలీస్స్టేషన్ సమీపంలోగల జాతీయ రహదారిపై శ్రీకాకుళం నుంచి విశాఖ వైపు వెళ్తున్న వాహనం అదుపు తప్పి అవతలి మార్గం వైపు దూసుకెళ్లింది.
బైక్ను ఢీకొట్టడంతో ఒకరి దుర్మరణం.. మరొకరికి గాయాలు
రణస్థలం, జూలై 10(ఆంధ్రజ్యోతి): రణస్థలం వద్ద జేఆర్పురం పోలీస్స్టేషన్ సమీపంలోగల జాతీయ రహదారిపై శ్రీకాకుళం నుంచి విశాఖ వైపు వెళ్తున్న వాహనం అదుపు తప్పి అవతలి మార్గం వైపు దూసుకెళ్లింది. దీంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారిలో ఒకరు దుర్మరణం పాలవ్వగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. జేఆర్పురం పోలీసుల కథనం మేరకు.. రాజాంకు చెందిన పరమేశ్వర్రెడ్డి (31), శ్రీకాకుళం హుడా కాలనీకి చెందిన కనకరాజు ద్విచక్రవాహనంపై శ్రీకాకుళం వైపు వెళ్తున్నారు. జేఆర్పురం పోలీస్స్టేషన్ సమీపంలో శ్రీకాకుళం నుంచి విశాఖ వైపు వెళ్తున్న ఐషర్ వాహనం అదుపు తప్పి డివైడర్ దాటి అవతలి మార్గంలో వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఘటనా స్థలంలోనే ధర్మల పరమేశ్వర్ రెడ్డి మృతిచెందారు. కనకరాజు అపస్మారక స్థితికి చేరుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు జేఆర్పురం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. గాయపడిన కనకరాజును శ్రీకాకుళంలోని రిమ్స్కు తరలించారు. పరమేశ్వర్రెడ్డితో పాటు కనకరాజు మెడికల్ రిప్రజెంట్లుగా పనిచేస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా విశాఖ నుంచి శ్రీకాకుళం వైపు వస్తుండగా ప్రమాదం జరిగింది. జేఆర్పురం పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.