minister achhenna: 2న వంశధార నీరు విడుదల
ABN , Publish Date - Jun 28 , 2025 | 11:51 PM
Vamsadhara River Water release ‘ఖరీఫ్ సీజన్లో సాగునీటి ఇబ్బందులు లేకుండా వచ్చే నెల 2 నుంచి వంశధార నీటిని విడుదల చేయాలి. రైతులకు విత్తనాలు, ఎరువులు సమస్యలు తలెత్తకూడదు. రైతు సేవా కేంద్రాలు ద్వారా అన్నదాతల అవసరాలకు తగ్గట్లు డీఏపీ, యూరియా ఎరువులు సిద్ధం చేయాల’ని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు.
- ఖరీఫ్లో విత్తనాలు, ఎరువుల సమస్య తలెత్తకూడదు
- అర్హులందరికీ అన్నదాత సుఖీభవ పడాల్సిందే
- సాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలి
- మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
టెక్కలి, జూన్ 28(ఆంధ్రజ్యోతి): ‘ఖరీఫ్ సీజన్లో సాగునీటి ఇబ్బందులు లేకుండా వచ్చే నెల 2 నుంచి వంశధార నీటిని విడుదల చేయాలి. రైతులకు విత్తనాలు, ఎరువులు సమస్యలు తలెత్తకూడదు. రైతు సేవా కేంద్రాలు ద్వారా అన్నదాతల అవసరాలకు తగ్గట్లు డీఏపీ, యూరియా ఎరువులు సిద్ధం చేయాల’ని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. శనివారం కోటబొమ్మాళి మండలం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ, నీటిపారుదల శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ‘అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన ప్రతి రైతు ఖాతాల్లో నిధులు జమ చేయాలి. ఎక్కడైనా సాంకేతిక సమస్య ఉంటే వ్యవసాయశాఖ అధికారులు ముందుగానే గుర్తించాలి. జూలై 2 నాటికి వంశధార ప్రధాన ఎడమకాలువ ద్వారా సాగునీరు విడిచిపెట్టేందుకు ముహూర్తం నిర్ణయించాం. అక్కడి ప్రజాప్రతినిధులు చేతులమీదుగా నీరు విడిచిపెట్టాలి. ముందుగా శివారు ప్రాంతాలకు సాగునీరు వెళ్లాలి. కాలువల్లో అడ్డంకులు తొలగించాలి. అవసరమైతే లష్కర్లను నియమించాలి. మూలపేట, మేఘవరం, బూరగాం, ఉమిలాడ వంటి శివారు ప్రాంతాలకు సాగునీరు అందే దిశగా చర్యలు చేపట్టాలి. 48ఆర్ గోపినాథపురం ఛానల్ వద్ద ఏటా రైతుల నుంచి సాగునీరు అందడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. ఈసారి ఆ పరిస్థితి రాకూడద’ని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. గొల్లూరు సమీపంలో వంతెన పనులు పూర్తిచేయాలని తెలిపారు. ఖాళీగా ఉన్న ఏఈ పోస్టుల భర్తీ అంశంపై ఉన్నతాధికారులతో మాట్లాడుతానన్నారు. ఇదిలా ఉండగా గొట్టాబ్యారేజ్కు 1,450 క్యూసెక్కుల సాగునీరు వస్తుందని ఈఈ శేఖరరావు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. సాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతామన్నారు. అలాగే జిల్లాలో లక్షా 46వేల హెక్టార్లలో వరి పండించే ప్రాంతముందని వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకుడు కోరాడ త్రినాధస్వామి తెలిపారు. 255 మెట్రిక్టన్నుల డీఏపీ అవసరముందని గుర్తుచేశారు. సమావేశంలో వంశధార ఎస్ఈ స్వర్ణకుమార్, డీఈఈ శ్రీధర్, వ్యవసాయశాఖ ఏడీ జగన్మోహనరావు పాల్గొన్నారు.