Industry: పరిశ్రమలకు స‘పోర్టు’
ABN , Publish Date - Jun 28 , 2025 | 12:22 AM
Industrial support Economic growth రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో.. అందరి చూపు జిల్లాలోని సంతబొమ్మాళి మండలంపైనే పడింది. ఈ మండలంలోని మూలపేటలో గ్రీన్ఫీల్డ్ పోర్టు ఏర్పాటు కావడమే ఇందుకు ప్రధాన కారణం. పోర్టు చుట్టూ పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహికులు ఆసక్తి చూపుతున్నారు.
అందరి చూపు.. ‘సంతబొమ్మాళి’ వైపు
మూలపేట చుట్టూ పారిశ్రామికాభివృద్ధికి కృషి
హల్దియా పెట్రో కెమికల్స్, కళ్యాణి స్టీల్స్, యామ్నా సంస్థల స్థల పరిశీలన
వనరులు కల్పించేలా అధికారుల చర్యలు
టెక్కలి, జూన్ 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో.. అందరి చూపు జిల్లాలోని సంతబొమ్మాళి మండలంపైనే పడింది. ఈ మండలంలోని మూలపేటలో గ్రీన్ఫీల్డ్ పోర్టు ఏర్పాటు కావడమే ఇందుకు ప్రధాన కారణం. పోర్టు చుట్టూ పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహికులు ఆసక్తి చూపుతున్నారు. అటు ఒడిశాలోని పారాదీప్, ఇటు విశాఖ పోర్టు మధ్యలో మూలపేట పోర్టు తయారవుతోంది. రూ.4,361.91కోట్లతో నిర్మిస్తున్న పోర్టు పనులు 50 శాతం ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ ఏడాది అక్టోబరు, డిసెంబరు మధ్య కాలంలో రవాణా నౌకల రాకపోకల ట్రైల్రన్ నిర్వహించాలని పోర్టు యంత్రాంగం భావిస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తిస్థాయిలో రవాణా నౌకలు నడిపించే దిశగా పోర్టు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పోర్టుకు అనుసంధానంగా నౌకాయానం ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారాభివృద్ధికిగాను పలు సంస్థలు ఈ ప్రాంతంపై దృష్టి సారించాయి. పోర్టుకు దగ్గరగా ఏపీఐఐసీకి చెందిన రెండువేల ఎకరాల భూముల, ఐదువేల ఎకరాల సాల్ట్ భూములు, 1,800 ఎకరాలు సమీర్పేట లాజిస్టిక్ భూములు, ఏడువేల ఎకరాలకుపైగా జిరాయితీ భూములు ఉన్నాయి. మరోవైపు సముద్రతీర ప్రాంతం కావడంతో ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల వాతావరణం లభించనుంది. పోర్టుకు దగ్గరగా 3వేల ఎకరాల్లో రూ.90వేల కోట్లతో పశ్చిమబెంగాళ్కు చెందిన హల్దియా పెట్రో కెమికల్స్ సంస్థ, అలాగే వెయ్యి ఎకరాల్లో రూ.20వేల కోట్లతో పూణేకు చెందిన కళ్యాణి స్టీల్స్, 300 ఎకరాల్లో రూ.20వేల కోట్లతో యూకేకు చెందిన యామ్నా సంస్థల ప్రతినిధులు గ్రీన్ అమ్మోనియా తయారీ పరిశ్రమలకు అవసరమైన భూసేకరణకు ఈ ప్రాంతాలను అన్వేషించారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన వనరులు, సాధ్యాసాధ్యాలను గుర్తించారు. అలాగే భావనపాడు ప్రాంతంలో పది ఎకరాల్లో రిసార్ట్స్ నిర్మాణం, పర్యాటకం అభివృద్ధికి, మరిన్ని చిన్నచిన్న పరిశ్రమలకు స్థల పరిశీలన చేశారు. కాగా, పోర్టు మూలంగా పలు అనుబంధ పరిశ్రమలు ఏర్పడి స్థానికులకు, నిర్వాసితులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడు భావిస్తున్నారు.
అనువైన వనరులు :
జాతీయ రహదారికి దగ్గరగా ఉండడం, విమానాశ్రయం, రైలు సౌకర్యాలు కలిగి ఉండడం ఆయా సంస్థలు మూలపేట పోర్టు పరిసర ప్రాంతాలను ఎంచుకున్నాయి. ఈ ప్రాంతాన్ని లాజిస్టిక్ పార్క్గా తయారీకి ద్వారాలు తెరుచుకున్నాయి. గత ఏడాది నవంబరులో బెంగాళ్ నుంచి హల్దియా పెట్రో కెమికల్స్ బృందం, ఏప్రిల్లో పూణేకు చెందిన కళ్యాణి స్టీల్స్, మే నెలలో యూకేకు చెందిన యామ్నా ప్రతినిధులు స్థానిక ఆర్డీవో, ఏపీ మారిటైం బోర్డు ప్రతినిధులు, పరిశ్రమల శాఖ అధికారులు, ఏపీఐఐసీ ప్రతినిఽధులు పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములను పరిశీలించారు ఈ ప్రాంతంలో పరిశ్రమలు నెలకొల్పితే ఏఏ రకాల వనరులు సమకూరుస్తామన్నది ఆయా సంస్థల ప్రతినిధులకు టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.
పాలీఇథలీన్ పరిశ్రమకు ప్రతిపాదన
మూలపేట పోర్టు పరిధిలో అమెరికాకు చెందిన ఎగ్జాంబిల్ కంపెనీ 1,250 ఎకరాల్లో రూ.83,500కోట్లతో గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్ పాలీఇథలీన్ పరిశ్రమ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. శుక్రవారం ఆ సంస్థ మేనేజర్లు, ఇంజనీర్లు, ప్రతినిధులు జెవెస్ట్కాట్, సేలింలో, డీపీ ప్రసన్న, శ్రీసీజ్ రామచంద్రన్, రంజిత్ కుమార్ ఈ ప్రాంతాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. పరిశ్రమ నెలకొల్పితే తాము సమకూర్చే వనరులపై ఆర్డీవో కృష్ణమూర్తి వారికి అవగాహన కల్పించారు. రైల్ రోడ్డు అనుసంధానం, టెక్కలిలో 220 కేవీ సబ్స్టేషన్ నుంచి అవసరమైన విద్యుత్, 50 కిలోమీటర్ల దూరంలోని గొట్టాబ్యారేజ్ నుంచి నీరు సమకూరుస్తామని తెలిపారు. సముద్రానికి దగ్గరగా మూడు కిలోమీటర్ల పరిధిలో కావాల్సిన స్థలం, సమీర్పేట లాజిస్టిక్ దగ్గర ఉన్న స్థలాన్ని వినియోగించుకోవచ్చునని పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా ఆర్డీవో వివరించారు. పోర్టు నిర్మాణ సంస్థ విశ్వసముద్ర జనరల్ మేనేజర్ శంకరరావు కూడా.. పోర్టు నిర్మాణం, బెర్త్లు సంఖ్య, మౌలిక సౌకర్యాలు కల్పన, నిర్మాణ పనులపై అమెరికన్ బృందానికి అవగాహన కల్పించారు. దీంతో ఈ ప్రాంతం పరిశ్రమ ఏర్పాటుకు అనుకూలంగా ఉందంటూ ఎగ్జాంబిల్ కంపెనీ ప్రతినిధులు జేవెస్ట్కాట్, సేలింలో తెలిపారు. ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేస్తే ఏడాదికి రెండు మిలియన్ మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ తయారీ చేస్తామని, ఎంతో మందికి ఉపాధి లభిస్తుందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ హేమసుందర్, ఏపీఐఐసీ జెడ్ఎం శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఉపాధి అవకాశాలు మెరుగు..
పోర్టుకు దగ్గరగా పరిశ్రమలు ఏర్పాటుకు అవసరమైన రోడ్డు, రైలు మార్గాలు, విద్యుత్, నీటి సదుపాయాలు, ఇబ్బందులు లేని ఫీజుబులిటీ భూములు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాం. పరిశ్రమలు ఏర్పాటు ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. విశాలమైన తీరప్రాంతం ఉంది. ఇప్పటికే హల్దియా పెట్రో కెమికల్స్, కళ్యాణి స్టీల్స్, యామ్నా సంస్థల ప్రతినిధులు ఈ ప్రాంతాన్ని సందర్శించడంతో వారికి అవగాహన కల్పించాం.
- ఎం.కృష్ణమూర్తి, ఆర్డీవో, టెక్కలి