rain: అకాల వర్షం.. రైతులకు నష్టం
ABN , Publish Date - Apr 19 , 2025 | 12:04 AM
rain:జిల్లాలో శుక్రవారం కురిసిన అకాల వర్షంతో రైతులకు నష్టం వాటిల్లింది. నరసన్నపేట, జమ్ము తదితర ప్రాంతాల్లో వరి, నువ్వు గింజలు తడిచిపోయాయి.
- జిల్లా వ్యాప్తంగా వాన
- తడిచిన ధాన్యం
- పిడుగు పడి గరుడభద్రలో ఆవు మృతి
- పలుచోట్ల విద్యుత్ ఉపకరణాలు ధ్వంసం
(ఆంధ్రజ్యోతి నెట్వర్క్)
జిల్లాలో శుక్రవారం కురిసిన అకాల వర్షంతో రైతులకు నష్టం వాటిల్లింది. నరసన్నపేట, జమ్ము తదితర ప్రాంతాల్లో వరి, నువ్వు గింజలు తడిచిపోయాయి. జలుమూరు మండలంలోని జలుమూరు, కోనసింహాద్రిపేట, నామానాపేట, కెల్లివానిపేట, పాగోడు, సైరిగాం, తిమడాం, కొమనాపల్లి, తదితర ప్రాంతాల్లో ధాన్యాన్ని రక్షించుకోవడానికి రైతులు పాట్లు పడ్డారు. ధాన్యం రాశులపై టార్పాలిన్లు కప్పారు. కల్లాల్లో చేరిన వర్షపునీటిని బయటకు పంపించడానికి అష్ట కష్టాలు పడ్డారు. పలుచోట్ల పిడుగులు పడ్డాయి. వజ్రపుకొత్తూరు మండలం గరుడుభద్ర గ్రామానికి చెందిన బొల్ల సుజాతమ్మ ఆవు పిడుగుపాటుకు గురై మృతిచెందింది. అలాగే, కంచిలి మండలంలోని గోకర్ణపురం, నారాయణపురం తదితర గ్రామాల్లో ట్రాన్సిస్టర్లు, టీవీలు, సెటాప్ బాక్స్లు, ఎల్ఈడీ టీవీలు, సీలింగ్ ఫ్యాన్లు ధ్వంసమైయ్యాయి. ఈదురుగాలులకు జలుమూరులో మామిడి కాయలు రాలిపోవడంతో రైతులకు తీవ్రనష్టం వాటిల్లింది. కాగా, ఈ వర్షం చెరుకు, వేరుశనగ, నువ్వు, పొద్దుతిరుగుడు వంటి పంటలకు మేలు చేస్తుందని పలువురు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

జలుమూరులో ధాన్యంపై తార్పాలిన్లు కప్పుతున్న రైతులు

వజ్రపుకొత్తూరు: గరుడభద్రలో మృతిచెందిన ఆవు