crime investigation: వీడిన జంట హత్యల మిస్టరీ
ABN , Publish Date - Jul 05 , 2025 | 12:15 AM
murder mystery solved వివాహేతర సంబంధం రెండు హత్యలకు దారి తీసింది. సోంపేట, మందస మండలాల్లో మే, జూన్ నెలల్లో జరిగిన రెండు హత్యలు ఒకే వ్యక్తి చేసినట్లు కాశీబుగ్గ డీఎస్పీ వి.వెంకట అప్పారావు తెలిపారు. శుక్రవారం ఆయన చాంబర్లో విలేకరుల సమావేశంలో ఈ ఘటనలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
సోంపేట, మందసలో హత్యకేసులు ఛేదించిన పోలీసులు
వివాహేతర సంబంధమే కారణమని నిర్ధారణ
సీసీ పుటేజీ ఆధారంగా నిందితుడి అరెస్టు
పలాస, జూలై 4(ఆంధ్రజ్యోతి): వివాహేతర సంబంధం రెండు హత్యలకు దారి తీసింది. సోంపేట, మందస మండలాల్లో మే, జూన్ నెలల్లో జరిగిన రెండు హత్యలు ఒకే వ్యక్తి చేసినట్లు కాశీబుగ్గ డీఎస్పీ వి.వెంకట అప్పారావు తెలిపారు. శుక్రవారం ఆయన చాంబర్లో విలేకరుల సమావేశంలో ఈ ఘటనలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. మే 17న సోంపేట మండలం పాలవలస గ్రామ జీడితోటలో గోకర్ల ఈశ్వరరావు, జూన్ 15న మందస మండలం పితాళి గ్రామ జీడితోటల్లో గోకర్ల రాజేశ్వరి హత్యకు గురయ్యారు. నెల రోజుల వ్యవధిలో రెండు హత్యలు జరగడం స్థానికంగా సంచలనం రేకెత్తించింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేశారు. పలాస మండలం మహదేవపురానికి చెందిన మడియా రామారావు ఈ రెండు హత్యలూ చేసినట్టు నిర్ధారించారు. ఆయనను అరెస్టు చేసి.. జంట హత్యల మిస్టరీని ఛేదించారు.
రాజేశ్వరి పాలవలసలో నివాసం ఉంటున్నారు. ఆమె భర్త చంద్రశేఖర్ ఉపాధి కోసం సౌదీ దేశం వెళ్లిపోయారు. ఈ క్రమంలో బంధువైన మడియా రామారావుతో రాజేశ్వరికి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయాన్ని రాజేశ్వరి ఎదురింట్లో ఉన్న గోకర్ల ఈశ్వరరావు గుర్తించారు. ఈశ్వరరావు కూడా ఆమెను లొంగదీసుకునే ప్రయత్నం చేశాడు. విషయం తెలుసుకున్న రామారావు ఈశ్వరరావుపై కక్ష పెంచుకున్నాడు. ఆయన్ను ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలని ప్రయత్నించాడు. పాలవలస గ్రామ దేవత సంబరాల సమయంలో మే 17న ఈశ్వరరావును సమీప జీడి తోటల్లోకి తీసుకువెళ్లి మద్యం తాగించి హతమార్చాడు. తరువాత ఏమీ తెలియనట్లు ఇంటికి వెళ్లిపోయాడు. అనంతరం రాజేశ్వరికి ఈ విషయాన్ని చెప్పాడు. ఈక్రమంలో రాజేశ్వరి, రామారావుల మధ్య కొనసాగుతున్న బంధం బెడిసికొట్టింది. రామారావును వదిలించుకునేందుకు రాజేశ్వరి ఆయన్ను బెదిరించడం ప్రారంభించింది. తనకు నగదు, ఆభరణాలు ఇవ్వాలని, లేదంటే వివాహేతర సంబంధంతో పాటు హత్య వివరాలు అందరికి చెబుతానని బెదిరించింది. దీంతో ఆమెను కూడా అడ్డుతొలగించుకోవాలని రామారావు భావించాడు. జూన్ 11న డబ్బులు ఇస్తానని నమ్మబలికి పితాళి గ్రామ సమీపంలో జీడితోటల్లోకి తీసుకువెళ్లాడు. ఆమె చున్నీతోనే మెడకు ఉరివేసి హతమార్చాడు. అనంతరం ఆమె మెడలో ఉన్న బంగారు ఆభరణాలతో వెళ్లిపోయాడు.
నిందితుడిని పట్టించిన మోటారు వాహనం
రాజేశ్వరిని హతమార్చిన రోజున రామారావు తన మోటారు వాహనంపై రాజేశ్వరిని హరిపురం వద్ద ఎక్కించుకొని పితాళి గ్రామం వైపు వెళ్లాడు. అనంతరం అక్కడ ఆమెను హతమార్చి పరారీ అయ్యాడు. రెండు హత్యలు జరిగిన నుంచి మందస, బారువ పోలీసులు రామారావుపైనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. చివరిగా రామారావు బైక్పై వెళ్తున్న సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలు గుర్తించారు. రామారావే హంతకుడని నిర్ధారణకు వచ్చారు. ఆయన కోసం వెతుకుతున్న క్రమంలో రామారావు గురువారం వీఆర్వో సమక్షంలో లొంగిపోయి తానే ఈశ్వరరావు, రాజేశ్వరిని హతమార్చినట్లు తెలిపాడు. నిందితుడి వద్ద మూడు తులాల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి, రామారావును శుక్రవారం కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ వి.వెంకట అప్పారావు తెలిపారు. సమావేశంలో కాశీబుగ్గ రూరల్, సోంపేట సీఐలు ఎం.తిరుపతిరావు, బి.మంగరాజు, మందస ఎస్ఐ కె.కృష్ణప్రసాద్, పోలీసులు పాల్గొన్నారు.