తీరంలో అలజడి
ABN , Publish Date - May 29 , 2025 | 11:40 PM
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా బందరువానిపేట వద్ద సముద్రపు అలలు ఎగసిపడుతున్నాయి.
- బందరువానిపేట వద్ద ఎగసి పడుతున్న కెరటాలు
- మునిగిన వలలు, తెప్పలు
- ఆందోళన చెందుతున్న మత్స్యకారులు
గార, మే 29 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా బందరువానిపేట వద్ద సముద్రపు అలలు ఎగసిపడుతున్నాయి. సముద్రపు ఒడ్డున భద్రపరుచుకున్న వలలు, తెప్పలు గురువారం ముంపునకు గురయ్యాయి. అవి ఇసుకలో కూరుకుపోవడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. సముద్రం పొంగి నీరు చాలా ముందుకు గ్రామం వరకు రావడంతో ఆ ప్రాంతమంతా జలమయంగా మారింది. దేవతా గుడుల చుట్టూ కూడా నీరు చేరింది. మరోవైపు తీరం సైతం కోతకు గురైంది. వలలు, తెప్పలను సురక్షిత ప్రాంతానికి తీసుకురావడానికి కూడా మత్స్యకారులుకు అవకాశం లేకుండాపోయింది. మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్లలేదు.
నీటిలో మునిగిన వలలు
నైరుతి రుతుపవనాలపై అప్రమత్తం: కలెక్టర్
శ్రీకాకుళం కలెక్టరేట్, మే 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోకి నైరుతి రుతుపవనాలు వారం ముందుగానే ప్రవేశిస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి కలెక్టర్ కార్యాలయంలో ఆయన గురువారం జిల్లా అధికారులతో సన్నద్ధత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గత ఏడాది ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, ఈసారి మరింత సమగ్రంగా, పటిష్టంగా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. విపత్తుల నిర్వహణ సంస్థ జారీ చేసిన నిబంధనల మేరకు కార్యాచరణను రూపొందించి, అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా మండల, డివిజన్, జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి, ఫోన్ నెంబర్లను ప్రజలకు అందుబాటులో ఉంచాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు చెరువుల గట్లను ఉమ్మడిగా తనిఖీ చేసి, వాటి స్థితిగతులపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో వ్యవసాయ శాఖ విత్తనాలు, ఎరువుల పంపిణీపై కార్యాచరణ రూపొందించాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా విత్తనాలు, ఎరువులు నిల్వ చేసిన దుకాణాల లైసెన్సులు రద్దు చేయాలని ఆదేశించారు. విత్తనాలు, ఎరువుల పంపిణీకి ముమ్మర ఏర్పాట్లు చేయాలన్నారు. నదీ పరీవాహక గ్రామాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. కాజ్వేలు, రోడ్లపైకి వరదనీరు వచ్చే ప్రాంతాల్లో వాహనాలకు ఆ సమయంలో అనుమతి ఇవ్వకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇరిగేషన్, విద్యుతు, రెవెన్యూ, వ్యవసాయ, హార్టికల్చర్ శాఖలు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా ప్రజల రక్షణే ముఖ్య బాధ్యతగా భావించి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో డీఆర్వో ఎం.వెంకటేశ్వరరావు, డీపీవో భారతీ సౌజన్య, జడ్పీ సీఈవో శ్రీధర్ రాజా, విపత్తుల నిర్వహణాధికారి రాము, ఆర్డీవో సాయి ప్రత్యూష, డీఎంహెచ్వో కె.అనిత, ఇరిగేషన్ ఎస్ఈ సుధాకర్, మత్స్యశాఖ ఏడీ సత్యనారాయణ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.