Transfors : బదిలీల సందడి
ABN , Publish Date - May 17 , 2025 | 12:27 AM
Employee transfers ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ శుక్రవారం ఆరంభమైంది. విద్యాసంవత్సరం ఆరంభం అయ్యేందుకు సుమారు నెల రోజులు గడువు ఉంది. తాజాగా ఉద్యోగుల బదిలీల ప్రక్రియపై ఉన్న బ్యాన్ను 18 రోజులు ప్రభుత్వం ఎత్తివేసింది. శుక్రవారం నుంచి జూన్ 2 వరకు బదిలీల ప్రక్రియ, కౌన్సెలింగ్ ముగించాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.
ఉద్యోగుల స్థానచలనం ప్రక్రియ ఆరంభం
ఐదేళ్లు ఒకేచోట పనిచేసిన వారు కదలాల్సిందే
శ్రీకాకుళం, మే 16(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ శుక్రవారం ఆరంభమైంది. విద్యాసంవత్సరం ఆరంభం అయ్యేందుకు సుమారు నెల రోజులు గడువు ఉంది. తాజాగా ఉద్యోగుల బదిలీల ప్రక్రియపై ఉన్న బ్యాన్ను 18 రోజులు ప్రభుత్వం ఎత్తివేసింది. శుక్రవారం నుంచి జూన్ 2 వరకు బదిలీల ప్రక్రియ, కౌన్సెలింగ్ ముగించాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. చాన్నాళ్ల నుంచి ఒకే సీటులో పాతుకుపోయినవారు కదలాల్సిన సమయం రాగా.. అలాగే బదిలీల కోసం ఎదురుచూస్తున్నవారికి కూడా కాస్త ఉపశమనం లభించినట్లయింది. జిల్లాలో సుమారు వెయ్యి మంది ఉద్యోగులు బదిలీ అయ్యే అవకాశం ఉంది. జూన్ 3 నుంచి బదిలీలపై నిషేధం అమల్లోకి రానుంది. కాగా తాము కోరుకున్న చోటుకు కొంతమంది ఉద్యోగులు బదిలీ అయ్యేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. మరికొందరు అనారోగ్య కారణాలతో కుటుంబానికి దగ్గరగా బదిలీ చేసుకునేలా ప్రయత్నిస్తున్నారు. ఉద్యోగ సంఘాల నేతలకు మూడు టెర్మ్లు మాత్రమే అవకాశం కల్పించారు. గతంలా కాకుండా... గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ఆఫీస్ బేరరల జాబితా కలెక్టర్ నుంచి సంబంధిత డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులకు వెళ్లాలి.
ఐదేళ్లు ఒకేచోట ఉంటే.. స్థానచలనం తప్పనిసరి
గత ప్రభుత్వ హయాం నుంచి ఇప్పటివరకు ఒకేచోట ఐదేళ్ల పాటు ఉద్యోగం నిర్వర్తించిన ఉద్యోగులు తప్పనిసరిగా స్థానచలనం ఉంటుంది. ఈమేరకు బదిలీలకు సంబంధించిన షెడ్యూల్లో ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఐదేళ్లు ఒకేచోట సర్వీసు పూర్తికాని ఉద్యోగులు దరఖాస్తులను కూడా అభ్యర్థన పరంగా పరిగణనలోకి తీసుకుంటారు. ఈ నెల 31న రిటైర్డ్ అయ్యే ఉద్యోగులకు బదిలీ ఉండదు. అయితే వాళ్లే బదిలీ కోరుకుంటే.. అడ్మినిస్ట్రేషన్ పరంగా అవసరమనుకుంటే పరిగణనలోకి తీసుకుంటారు.
వివాదస్పదం లేకుండా..
ఉద్యోగుల బదిలీలు, పోస్టింగ్ల ప్రక్రియ అన్ని ప్రభుత్వ శాఖలలో జరగనుంది. ఇచ్చిన గడువులోగా బదిలీలు పూర్తిచేయాల్సిన బాధ్యత.. శాఖల వారీగా ఉన్నతాధికారులదే. ప్రభుత్వ మార్గదర్శకాల ఆధారంగా బదిలీ చేపడితే ఎటువంటి వివాదాలు ఉండవు. వైసీపీ ప్రభుత్వ హయాంలో సిఫార్సులు... గుర్తింపు సంఘాల నుంచి లేఖలు సమర్పించడంతో బదిలీల ప్రక్రియ వివాదాస్పదమైంది. ఇటువంటివి జరగకుండా కలెక్టర్ పర్యవేక్షణ ఉంటుంది. అలాగే ప్రతి శాఖలో బదిలీకి సంబంధించి ఇంటర్నల్ కమిటీ ఏర్పాటయ్యాక... ఇదంతా జరుగుతుంది. అనారోగ్య సమస్యలు ఉన్నవారికి, స్పౌజ్కోటాకు పాధాన్యముంటుంది. పదోన్నతి లభించినవారికి తప్పనిసరిగా స్థానచలనం ఉంటుంది.