cm chandrababu: ప్రభుత్వ పాలసీలతో పైకొచ్చినవారు పేదలకు చేయూతనివ్వాలి
ABN , Publish Date - Apr 26 , 2025 | 11:26 PM
support for the poor ప్రభుత్వ పాలసీలతో ఆర్థికంగా పైకొచ్చినవారు సమాజంలో పేదలు అభివృద్ధి చెందేలా వారికి చేయూతనివ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. శనివారం ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో ‘మత్స్యకారుల సేవలో’ పథకాన్ని సీఎం ప్రారంభించారు.
సీఎం చంద్రబాబునాయుడు
శ్రీకాకుళం, ఏప్రిల్ 26(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాలసీలతో ఆర్థికంగా పైకొచ్చినవారు సమాజంలో పేదలు అభివృద్ధి చెందేలా వారికి చేయూతనివ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. శనివారం ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో ‘మత్స్యకారుల సేవలో’ పథకాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం ప్రజావేదిక సభలో జీరో ప్రావర్టీ-పీ4 కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ‘రాష్ట్రంలో పేదరికాన్ని సమూలంగా నిర్మూలించాలి. పేదలకు ప్రభుత్వ పథకాలు అందివ్వడమే కాకుండా మార్గదర్శుల ద్వారా సాయం అందించి అన్ని విధాలా పైకి తీసుకువచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మార్గదర్శులు దత్తత తీసుకున్న కుటుంబాలకు ఏమి చేస్తున్నారో కూడా సమీక్ష చేస్తాం. 2029 నాటికి రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయాలన్నదే నా లక్ష్యం. అన్ని విధాలా ఆర్థికంగా పైకొచ్చినవారు పేద కుటుంబాలను ఆదుకుంటే సమాజంలో అసమానతలు ఉండవు’ అని సీఎం అన్నారు. అనంతరం మార్గదర్శకులను సన్మానించారు.
బంగారు కుటుంబానికి ఎంపికైన వారు మాట్లాడుతూ..
ఆలుపు లచ్చమ్మ : నా భర్త ఉపాధి కోసం గుజరాత్ రాష్ట్రం వీరావళ్ వెళ్లారు. నేను ఇంటి వద్దనే ఉంటూ పిల్లలను చూసుకుంటాను. మాది పేద కుటుంబం. నెలకు సుమారు రూ.12 నుంచి రూ. 15వేలు మాత్రమే వస్తాది.
సూరాడ అప్పన్న : మా అమ్మానాన్న లేరు. మా అక్కకు పదిహేనేళ్ల కిందట పెళ్లయింది. కానీ రెండేళ్లకే మానసిక సమస్యను ఎదుర్కోవడం వల్ల ఆమెను భర్త వదిలేశారు. ప్రస్తుతం మా అక్క, ఆమె ఇద్దరి పిల్లలూ మా వద్దనే ఉంటున్నారు. నా భార్య బీఎస్సీ కంప్యూటర్స్ చేసింది. నేను, నా తమ్ముడు వేటకు వెళ్లి మా కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. మొత్తం ఎనిమిది మంది కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాం. మా అక్కకు పింఛన్ మంజూరు చేయించండి.
సీఎం: మీ సోదరికి వెంటనే పింఛన్ అందిస్తాం. ఇల్లు కూడా నిర్మించి ఇస్తాం. ఇక్కడే కలెక్టర్కు ఆదేశిస్తున్నా. నీ భార్యకు ‘మార్గదర్శకులు’ ఉద్యోగం ఇవ్వాలని.. ఎలా ఆదుకోవాలో ఏమి చేస్తున్నారో ఇక్కడే చెప్పాలి.
..................
మార్గదర్శిలు మాట్లాడుతూ...
బుడుమూరు శ్రీరామమూర్తి: నేను పాలిటెక్నిక్ కళాశాలలో ప్రిన్సిపాల్గా పని చేసి రిటైర్డ్ అయ్యాను. ఈ ప్రాంతంలో డిగ్రీ, పీజీ, డిప్లమో, అగ్రికల్చర్, వెటర్నరీ కోర్సులతో కాలేజీ పెట్టాం. రాష్ట్ర ప్రగతిలో ప్రజల భాగస్వామ్యం పెరిగితే మరింత అభివృద్ధి చెందుతుందని సీఎం చంద్రబాబు ఆలోచన. నేను 25 కుటుంబాలను దత్తత తీసుకుంటాను. సూరాడ అప్పన్న ఇంట్లో కంప్యూటర్ ఏర్పాటు చేసి.. ఆయన భార్యకు నైపుణ్యం పెంచి మా వ్యవసాయ కళాశాలలో కంప్యూటర్ ఆపరేటర్ ప్రొగ్రామర్గా అవకాశం కల్పిస్తాం. వారి పిల్లలను మా కాలేజీలో ఉచితంగా చదివిస్తాం.
పి.రాజేష్బాబు : నేను కూడా సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చాను. 1995-2004 మధ్య సీఎం చంద్రబాబు ఐటీ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం చేపట్టారు. మేము అబ్రాడ్లో కంపెనీ పెట్టాం. 2018లో పైడిభీమవరంలో హెల్త్ కేర్ ఇండస్ట్రీ పెట్టాం. కొవిడ్ సమయంలో మా పరిశ్రమ ద్వారా ఆక్సిజన్ అందించాం. చంద్రబాబుకు మేము రుణపడి ఉన్నాం. మా పరిశ్రమ తరపున అలుపు లచ్చమ్మ కుటుంబానికి సాయం అందించడంతోపాటు 20 కుటుంబాలను దత్తత తీసుకుంటాం. మత్స్యకారులకు టూల్ కిట్స్, బోట్స్, వారి పిల్లలకు చదువుతో పాటు స్కాలర్షిప్స్ అందిస్తాం.