ఇదో రకం దందా
ABN , Publish Date - Jul 16 , 2025 | 11:34 PM
జీడిపిక్కల దళారులు తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్త దందాకు తెరలేపారు.
- జీడి పిక్కల విక్రయాల్లో దళారుల మోసం
-ఒక గ్రామానికి చెందిన పిక్కలు మరో గ్రామానివిగా చెప్పి అమ్మకం
- వ్యాపారులను బోల్తాకొట్టిస్తున్న వైనం
వజ్రపుకొత్తూరు, జూలై 16(ఆంధ్రజ్యోతి): జీడిపిక్కల దళారులు తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్త దందాకు తెరలేపారు. చెట్టుపేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్న చందాన వ్యవహరిస్తున్నారు. ఒక గ్రామానికి చెందిన జీడి పిక్కలను, మరో గ్రామానికి చెందిన పిక్కలుగా నమ్మబలికి జీడి వ్యాపారులకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు. అక్కుపల్లి, గుణుపల్లి, చీపురుపల్లి, మెట్టూరు పంచాయతీల పరిధిలోని నేలలు సారవంతంగా ఉంటాయి. ఈ భూముల్లో పండే జీడిపిక్కలకు మంచి డిమాండ్ ఉంటుంది. మిగిలిన గ్రామాల్లో పండే పంట కంటే ఈ గ్రామాల్లోని జీడి పంట బాగుంటుందని, కిలో జీడిపప్పు అధికంగా దిగుబడి వస్తుందని వ్యాపారుల నమ్మకం. అందుకే ఈ గ్రామాల పిక్కలను అధిక ధరకు కొనుగోలు చేస్తుంటారు. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు దళారులు మోసాలకు పాల్పడుతున్నారు. ఎక్కడెక్కడో కొనుగోలు చేసిన పిక్కలను పైన చెప్పిన గ్రామాల పిక్కలుగా నమ్మించి వ్యాపారులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ పిక్కల నుంచి ఆశించిన స్థాయిలో పప్పు దిగుబడి రాకపోవడంతో వ్యాపారులు నష్టపోతున్నారు. దళారులు చేస్తున్న మోసాన్ని వారు గుర్తించి అక్కుపల్లి, గుణుపల్లి, చీపురుపల్లి, మెట్టూరు తదితర గ్రామాల పెద్దలకు వివరించారు. ఇదే కొనసాగితే మీ గ్రామాల్లో పండించే పిక్కలకు కూడా డిమాండ్ పడిపోతుందని స్పష్టం చేశారు. దీంతో ఆయా గ్రామాల పెద్దలు అప్రమత్తమై దళారులను పిలిచి మాట్లాడారు. లాభాల కోసం దొంగ వ్యాపారాలు చేయడం తగదని, మరోసారి ఇలా చేస్తే అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.