కనీస వేతనం లేదు.. ప్రభుత్వ పథకాలు అందవు
ABN , Publish Date - Jun 24 , 2025 | 12:04 AM
తమ ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించరు.. కనీస వేతనం అమలు చేయరు.. అలాగని ప్రభుత్వ ఉద్యోగులంటూ పథకాలకూ అర్హత లేకుండా చేశారు.. ఇక కుటుంబాల తో మేమెలా బతికేదంటూ అంగన్వాడీలు ప్రభుత్వాన్ని నిలదీశారు.
కలెక్టరేట్ వద్ద అంగన్వాడీల ధర్నా
శ్రీకాకుళం కలెక్టరేట్, జూన్ 23(ఆంధ్రజ్యోతి): తమ ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించరు.. కనీస వేతనం అమలు చేయరు.. అలాగని ప్రభుత్వ ఉద్యోగులంటూ పథకాలకూ అర్హత లేకుండా చేశారు.. ఇక కుటుంబాల తో మేమెలా బతికేదంటూ అంగన్వాడీలు ప్రభుత్వాన్ని నిలదీశారు. సీఐటీయూ, అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద పెద్దఎత్తున ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా అంగన్ వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కల్యాణి, సీఐటీ యూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్ అమ్మన్నాయు డు, పి.తేజేశ్వరరావు మాట్లాడుతూ.. ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలని, మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీ లుగా మారుస్తామని అసెంబ్లీలో ప్రకటించిన మంత్రి హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అతి తక్కువ జీతాలు ఇస్తూ తమను ప్రభుత్వ పథకాలకు దూరం చేయడం సరికాదన్నారు. అమ్మకి వందనం వంటి పథకాలు అందించకపోతే మా పిల్లలను ఎలా చదివించుకోవాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కూటమి నాయకులు తాము అధికారంలోకి వస్తే చిరుద్యోగులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఎన్నికల మేని ఫెస్టోలో పెట్టారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. తల్లికివందనం, విద్యాదీవెన, వృద్ధులకు పింఛన్లు, వితంతు పెన్షన్ ఇవ్వడం లేదన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే దశలవారీగా పోరాటం చేస్తామన్నారు. అనంతరం జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన గ్రీవెన్స్లో డీఆర్వో ఎం.వెంకటేశ్వరరావును కలిసి వినతిపత్రం అంద జేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు రమణ, సూరయ్య, అంగన్వాడీ యూనియన్ ప్రనిధులు డి.సుధ, ఎన్.హైమవతి, పి.లతాదేవి, కె.సుజాత, జె.కాంచన, కె.లక్ష్మి, ఎస్.ఆదిలక్ష్మి, పి.రమణమ్మ, కె.మోహిని, జ్యోతి, టి.రాజేశ్వరి, వై.విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.