ఎంపీసీ, బైపీసీకి ఐదేసి పేపర్లే
ABN , Publish Date - Oct 29 , 2025 | 11:45 PM
Changes in the inter examination procedure ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఈ ఏడాది నుంచి పరీక్షల నిర్వహణలో సమూలమార్పులకు ఇంటర్ బోర్డు శ్రీకారం చుట్టింది. నూతన సిలబస్ మేరకు పరీక్షల నిర్వహణకు ఇటీవల షెడ్యూల్ను విడుదల చేసింది.
ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షా విధానంలో మార్పులు
ఈ ఏడాది నుంచే అమలు
నరసన్నపేట, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఈ ఏడాది నుంచి పరీక్షల నిర్వహణలో సమూలమార్పులకు ఇంటర్ బోర్డు శ్రీకారం చుట్టింది. నూతన సిలబస్ మేరకు పరీక్షల నిర్వహణకు ఇటీవల షెడ్యూల్ను విడుదల చేసింది. 2025-26 విద్యాసంవత్సరం నుంచి ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ఆరు పేపర్లు స్థానంలో ఐదు పేపర్లకు పరీక్షలు నిర్వహించనున్నారు.
ఎంపీసీ విద్యార్థులకు ఐదు పేపర్లకు మొత్తం 500 మార్కులు కాగా 470 మార్కులకు రాత పరీక్షలు నిర్వ హిస్తారు. గతంలో గణితం పేపర్-1, 2కు 75 మార్కులు చొప్పున ఉండేవి. కానీ ఈ ఏడాది నుంచి రెండు పేపర్లను కలిపి ఒకే పరీక్షగా 100 మార్కులకు నిర్వహిస్తారు. పాస్ మార్కులు 35. అలాగే ఫిజిక్స్ 85, కెమిస్ట్రీ 85 మార్కులకు, ఫస్ట్, సెకండ్ లాంగ్వేజస్కు వంద మార్కులు చొప్పున రెండు పరీక్ష పత్రాలు ఇస్తారు.
బైపీసీలో మార్కులు మొత్తం 500కాగా, 455 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. ప్రాక్టికల్స్ (కెమిసీ్ట్ర -15, ఫిజిక్స్-15, బయాలజీ -15) 45 మార్కులు. గతంలో బోటనీ, జువాలజీ 60 మార్కులకు చొప్పున రెండు పేపర్లు ఉండేవి. ప్రస్తుతం ఈ రెండు కలిపి 85 మార్కులుగా ఒకే ప్రశ్నాపత్రంగా ఇస్తారు. ఆన్షర్ షీట్లు మాత్రం రెండుగా ఉంటాయి. బోటనీ 43 మార్కులు, జువాలనీ 42 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. ఉత్తీర్ణత 29 మార్కులుగా నిర్ధారించారు. ఫిజిక్స్ 85కి, కెమిస్ట్రీ 85 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఫస్ట్, సెకండ్ లాంగ్వేజెస్కు వంద మార్కుల చొప్పున పరీక్ష పత్రాలు ఇస్తారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఈ విధానం అమలు చేస్తారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థు లకు మాత్రం పాతవిధానంలోనే ప్రశ్నపత్రాలు ఉంటాయి.
జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 38, మోడల్స్కూల్లో ఇంటర్ తరగతులు నిర్వహించేవి -13, కేజీబీవీలు -25, సోషల్ వెల్ఫేర్ కళాశాలలు -9, ట్రైబల్ వెల్పేర్ కళాశాల -1, ప్లస్ -1 కళాశాలలు 6, మహాత్మజ్యోతిరావు పూలే మహిళా కళాశాల -1 , ప్రైవేటు జూనియర్ కళాశాలలు -71 ఉన్నాయి. ఆయా కళాశాల్లో సుమారు 24వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు కొత్త ప్రశ్నపత్రాలపై అవగాహనకు ఓరియంటల్ తరగతులు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ పవన్ తెలిపారు.