ఇప్పిలిలో వృద్ధుడు..
ABN , Publish Date - May 07 , 2025 | 11:58 PM
మండలంలోని ఇప్పిలి గ్రామంలో కరణం నర్సింగరావు (63) అనే వృద్ధు డు దారుణ హత్యకు గురయ్యాడు. మంగళవారం రాత్రి తన ఇంటి మేడపై నిద్రిస్తున్న ఆయన్ను కత్తవతో కొట్టి చంపేశారు.
శ్రీకాకుళం రూరల్, మే7(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఇప్పిలి గ్రామంలో కరణం నర్సింగరావు (63) అనే వృద్ధు డు దారుణ హత్యకు గురయ్యాడు. మంగళవారం రాత్రి తన ఇంటి మేడపై నిద్రిస్తున్న ఆయన్ను కత్తవతో కొట్టి చంపేశారు. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు నిద్ర లేచి చూడగా నర్సింగరావు రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్నాడు. వెంటనే వారు రూరల్ పోలీసులకు సమాచారం అందజేశారు. ఎస్ఐ కె.రాము తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం సీఐ పైడపునాయుడు కూడా చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. క్లూస్ టీం ఘటనా స్థలంలో ఆధారాలను సేకరించింది. మృతదేహాన్ని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య యశోద ఫిర్యాదు మేరకు శ్రీకాకుళం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఘర్షణే కారణమా?
నర్సింగరావుకు తన ఇంటి ఎదురుగా ఉన్న రమణకు మంగళవారం రాత్రి ఘర్షణ జరిగింది. నర్సింగరావు తన ద్విచక్ర వాహనాన్ని ఇంటి ఎదురుగా పెట్టడంతో రమణ గొడవకు దిగాడు. దీంతో స్థానికులు వారికి సర్ది చెప్పారు. దీన్ని మనసులో ఉంచు కొని మేడ మీద నిద్రపోతున్న నర్సింగరావుపై రమణ దాడి చేసి ఉంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రమణ పరారీలో ఉండడంతో ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎచ్చెర్ల మండలం జీరుపాలెంలో వద్ద రమణను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.