కొత్తమ్మతల్లి జాతరను ఘనంగా నిర్వహించాలి
ABN , Publish Date - Sep 08 , 2025 | 11:52 PM
రాష్ట్ర పండుగగా కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లి జాతరను ఘనంగా నిర్వహించాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
- మంత్రి అచ్చెన్నాయుడు
- ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష
శ్రీకాకుళం, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పండుగగా కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లి జాతరను ఘనంగా నిర్వహించాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈనెల 23 నుంచి 25వరకు జరగనున్న కొత్తమ్మతల్లి జాతర ఏర్పాట్లపై శ్రీకాకుళం కలెక్టరేట్లో సోమవారం అధికా రులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జాతరను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని, ఏర్పాట్లు పకడ్బం దీగా పూర్తిచేయాలని సూచించారు. లక్షలాది మంది భక్తులు అమ్మ వారిని దర్శించుకోనున్నారని.. ప్రముఖ ఆలయాల తరహాలో క్యూలైన్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. ఉచిత దర్శనానికి ప్రాధాన్యమివ్వాలని వెల్లడించారు. శోభాయాత్ర, గ్రామీణ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఎగ్జిబిషన్, ఫైర్వర్క్స్, హెలికాఫ్టర్ రైడింగ్ వంటి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రతిరోజు 25వేల మందికి అన్నదానం నిర్వ హించాలని, అందులో మజ్జిగ కూడా ఉండాలని చెప్పారు. చిన్నపిల్లలకు పాలు, భక్తులకు తాగునీటి సదుపాయం కల్పించాలని చెప్పారు. క్యూలైన్లు, బారికేడ్లు టెంట్లు, లౌడ్స్పీకర్లు, డ్రోన్ కెమెరాలు, ఎల్ఈడీ స్ర్కీన్లు, ఆన్లైన్ సిస్టమ్, శానిటేషన్, వైద్య శిబిరాలు, ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సుల ఏర్పాటుపై అన్ని విభాగాల సమన్వయంతో పనిచేసి జాతరను విజయవంతం చేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వరరెడ్డి, పీఏసీఎస్ మాజీచైర్మన్ కింజరాపు హరిప్రసాద్, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.