tender: ఆ టెండర్ ఔట్
ABN , Publish Date - Apr 19 , 2025 | 12:08 AM
tender: జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, మోడల్ స్కూళ్లలో విద్యార్థుల భోజనాలకు సంబంధించి రూపాయికే కిలో చొప్పున కూరగాయలు సరఫరా చేసేందుకు టెండరు వేయడం.. అధికారులు సైతం ఖరారు చేసేయడం తెలిసిందే.
- కేజీబీవీలు, మోడల్ స్కూళ్లకు రూపాయికే కూరగాయల సరఫరాలో గిమ్మిక్కులు
- నాణ్యతలేనివి అందిస్తున్నట్లు నిర్ధారణ
- ఎట్టకేలకు అధికారుల చర్యలు
- వెండర్కు నోటీసులు ఇచ్చినా బదులివ్వలే
- పాత టెండరుదార్లను పిలిపించిన జేసీ
- ఎల్2ను ఖరారు చేసే అవకాశం?
శ్రీకాకుళం, ఏప్రిల్ 18(ఆంధ్రజ్యోతి):జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, మోడల్ స్కూళ్లలో విద్యార్థుల భోజనాలకు సంబంధించి రూపాయికే కిలో చొప్పున కూరగాయలు సరఫరా చేసేందుకు టెండరు వేయడం.. అధికారులు సైతం ఖరారు చేసేయడం తెలిసిందే. కూరగాయల ధరలు మండిపోతుంటే రూపాయికే వాటిని ఎలా సరఫరా చేస్తారని, నాణ్యత లేని కూరగాయలను అందించి విద్యార్థులకు వండిపెడుతున్నారని ‘ఆంధ్రజ్యోతి’ ఈ ఏడాది జనవరిలో వరుస కథనాలను ప్రచురించింది. ఎట్టకేలకు దీనిపై అధికారులు స్పందించారు. కిలో చొప్పున టెండరు ఖరారు చేసుకున్న వెండర్ను తొలగించేశారు. నిబంధనల ప్రకారం కూరగాయలను సరఫరా చేయడంలేదని నిర్ధారణకు వచ్చి ఈ చర్యలు చేపట్టారు.
జేసీకి ఫిర్యాదులు..
కేజీబీవీలు, మోడల్ స్కూళ్లకు వెండర్ కూరగాయలను సక్రమంగా సరఫరా చేయడంలేదని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్కు ఫిర్యాదులు అందాయి. దీంతో ఆయన సమగ్రశిక్ష ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. అయితే, కమిటీ తనిఖీకి వస్తున్న విషయమై వెండర్కు ముందుగానే సమాచారం అందేది. దీంతో కమిటీ వెళ్లిన రోజున అంతా నాణ్యమైన సరుకులు ఉండేవి. దీంతో జేసీ స్వయంగా రంగంలోకి దిగారు. పలు పాఠశాలలను పరిశీలించి కూరగాయల సరఫరాలో నిబంధనలు పాటించడం లేదని నిర్ధారించారు. ఆయన ఆదేశాలతో సమగ్ర శిక్ష ఏపీసీ వెండర్కు మూడు దఫాలు నోటీసులను జారీ చేశారు. కానీ, ఏ ఒక్క నోటీసుకూ వెండర్ నుంచి బదులు లేదు. వాస్తవంగా రూపాయికి కిలో చొప్పున కూరగాయలు సరఫరా చేయడం అసాధ్యం. కానీ, లెక్కల గిమ్మిక్కులతో వెండర్ ఇదంతా చేశారు. కొందరు అధికారులు సహకరించడంతో ఇన్నాళ్లు గడిచింది. ఆలస్యంగానైనా ఉన్నతాధికార యంత్రాంగం కళ్లు తెరిచి చర్యలకు ఉపక్రమించింది.
దరఖాస్తుదారులకు పిలుపు..
కేజీబీవీలు, మోడల్ స్కూళ్లకు కూరగాయలు సరఫరా చేసేందుకు ఎవరెవరు టెండర్లు దాఖలు చేశారో.. వాళ్లందరినీ జాయింట్ కలెక్టర్ గురువారం తన చాంబర్కు పిలిపించారు. పాత వెండర్ను తప్పించినట్లు వారికి చెప్పారు. అయితే, అన్ని రకాల కూరగాయలను పాత వెండరు ఖరారు చేసిన టెండరు ప్రకారమే రూ.203కే సరఫరా చేస్తామన్న వారికే కొత్త టెండర్ ఖరారు చేస్తామని చెప్పారు. ఈ లెక్కన చూసినా సరే.. మరలా రూపాయికే కిలో కూరగాయలను సరఫరా చేయాల్సి ఉంటుందని చెప్పి కొంతమంది దరఖాస్తుదారులు వెనకడుగేశారు. కొందరు మాత్రం కొత్తగా రీటెండర్ను పిలవాలని డిమాండ్ చేశారు. అయితే ఎల్2గా అప్పట్లో ఓ మహిళ.. అన్ని కూరగాయలను కలిపి రూ.229కే సరఫరా చేస్తామని టెండరు వేశారు. అయితే ఈమె ప్రస్తుతం వెండరుగా ఉన్న వ్యక్తి బంధువని సమాచారం. ఎల్2 టెండరు దరఖాస్తును పరిగణలోకి తీసుకోవాలని కొందరు వ్యాపారులు, కొత్తగా టెండరు వేయాలని మరికొందరు ఒత్తిడి తెచ్చారు. దీంతో గురువారం రాత్రి వరకు టెండరు ఖరారు కాలేదు. అన్ని రకాల కూరగాయలను రూ.229కే ఎల్2గా వేసినా.. కొన్ని కూరగాయల ధరలు రూపాయి కంటే అధికంగా ఉన్నాయి. దీంతో ఎల్2కే టెండర్ ఖరారు అవుతుందని విశ్వసనీయ సమాచారం. అలాగే, చికెన్, గుడ్లు పాలు, పప్పు దినుసులను సరఫరా చేస్తున్న కాంట్రాక్టును కూడా రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలవాలని ప్రజలు కోరుతున్నారు. సోమవారం టెండర్లను పిలవనున్నారు.