డ్రంకెన్ డ్రైవ్ కేసులో పది మందికి జరిమానా
ABN , Publish Date - Nov 28 , 2025 | 11:56 PM
మద్యం తాగి వాహనాలు నడిపి పట్టుబడిన పది మందికి రూ.10 వేలు చొప్పున జరీమానా విధిస్తూ టెక్కలి కోర్టు న్యాయాధికారి మూధురి శుక్రవారం తీర్పు చెప్పినట్టు ఎస్ఐ షేక్ మహ్మద్ ఆలీ తెలిపారు.
నందిగాం, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): మద్యం తాగి వాహనాలు నడిపి పట్టుబడిన పది మందికి రూ.10 వేలు చొప్పున జరీమానా విధిస్తూ టెక్కలి కోర్టు న్యాయాధికారి మూధురి శుక్రవారం తీర్పు చెప్పినట్టు ఎస్ఐ షేక్ మహ్మద్ ఆలీ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల మేరకు.. మండలానికి చెందిన కొల్లి సీత య్య, రాజు చౌదరి, కొర్జాన దుర్యోధన, మట్ట మోహనరావు, అంబోడి జోగారావు, శిర్ల ప్రసాద్, తెంబూరు సోమేశ్వరరావు, సనపల రామారావు, కోమటూరు భాస్క రరావు, దుప్పలపూడి శంకరరావు వేర్వేరుగా డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడ్డారు. వీరిని కోర్టులో హాజరుపరచగా ఒక్కొక్కరికి రూ.10 వేలు జరిమానా విధించారు. జరిమానా చెల్లించకుంటే పది రోజులు జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. మళ్లీ మద్యం తాగి వాహనాలు నడిపి పట్టుబడితే జైలుశిక్ష తప్పదని హెచ్చరించారు.
టెక్కలి: స్థానిక పోలీస్స్టేషన్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ కేసుకు సంబంధించి ఇద్దరికి రూ.10 వేలు చొప్పున జరీమానా విధిస్తూ టెక్కలి కోర్టు న్యాయాధికారి యు.మాధురి తీర్పు చెప్పినట్టు సీఐ విజయ్కుమార్ తెలిపారు. 2024లో పట్టుబడిన టెక్కలికి చెందిన తలగాపు బాబూరావు, మాకువరం గ్రామానికి చెందిన అరసవల్లి రవికి జరిమానా విధించారు.
ఆటో డ్రైవర్కు ఏడు రోజుల జైలు
శ్రీకాకుళం క్రైం, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిం చిన కేసులో ఆటో డ్రైవర్ ఎన్ని శ్రీనివాసరావుకు శుక్రవారం ఏడు రోజుల జైలుశిక్ష పడింది. ట్రాఫిక్ సీఐ వానపల్లి రామారావు తెలిపిన వివరాల మేరకు.. గురువా రం శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ అవుట్ గేటు వద్ద వన్వే రోడ్డుపైకి శ్రీనివాసరావు తన ఆటోతో ప్రవేశించాడు. అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపేందు కు ప్రయత్నించగా శ్రీనివాసరావు ఆటోని వేగంగా ముందుకు నడిపాడు. పోలీస్ సిబ్బందితో ప్రమాదకరంగా ప్రవర్తించాడు. దీంతో శ్రీనివాసరావుపై పోలీసులు కేసు నమోదు చేసి శుక్రవారం సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచా రు. ఈ మేరకు ఆయనకు ఏడు రోజుల జైలు శిక్ష విధించినట్టు సీఐ తెలిపారు.
వ్యభిచార గృహంపై పోలీసుల దాడి
శ్రీకాకుళం క్రైం, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వెనుక ఉన్న ఓ అపార్ట్మెంట్లో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై టూటౌన్ పోలీసులు శుక్రవారం దాడి చేశారు. నిర్వాహకురాలితో పాటు ఇద్దరు యువతు లను, ఒక విటుడిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ఈశ్వరరావు తెలిపారు.