Granite: ‘గ్రానైట్’పై పన్నుపోటు
ABN , Publish Date - Jun 27 , 2025 | 12:02 AM
Granite industry Tax increase నీలిరంగు గ్రానైట్ పరిశ్రమపై పన్నుపోటు పడింది. ఇందుకు సంబంధించి ఏపీఎంఎంసీ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్లో విడుదలైన జీవో.57కు సంబంధించి ఇందులో తాజా మార్గదర్శకాలు జత చేసింది.
క్యూబిక్ మీటర్ విధానం నుంచి టన్నుల దిశగా సీనరీస్ చార్జీలు
కట్టర్సైజ్ బ్లాక్కు పది నుంచి 20శాతం పెంపు
గ్యాంగ్సా బ్లాక్కు 20 నుంచి 30శాతం అదనం
టెక్కలి, జూన్ 26(ఆంధ్రజ్యోతి): నీలిరంగు గ్రానైట్ పరిశ్రమపై పన్నుపోటు పడింది. ఇందుకు సంబంధించి ఏపీఎంఎంసీ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్లో విడుదలైన జీవో.57కు సంబంధించి ఇందులో తాజా మార్గదర్శకాలు జత చేసింది. గతంలో కట్టర్సైజ్, బిలోగ్యాంగ్సా, గ్యాంగ్సా సైజుల్లో సీనరీస్ చార్జీలు వసూలు చేసేవారు. ఈసారి కట్టర్, గ్యాంగ్సా సైజులకే పన్నుల వసూళ్లు పరిమితం చేశారు. క్యూబిక్ మీటర్లలో కాకుండా టన్నేజ్ల రూపంలో సీనరీస్ చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించారు. కట్టర్సైజ్కు పది నుంచి 20శాతం, గ్యాంగ్సా సైజులకు 20 నుంచి 30శాతం పన్నులు పెంచారు. దీంతో నీలిరంగు గ్రానైట్ పరిశ్రమల యజమానులు ఆందోళన చెందుతున్నారు.
గతంలో కట్టర్సైజ్ బ్లాకులకుగాను అన్నిరకాల పన్నులు కలిపి క్యూబిక్ మీటర్కు రూ.4,500 ఉండగా, ఈసారి రూ.4,900 నుంచి రూ.5,250కు పెంచారు. గ్యాంగ్సా సైజుకు గతంలో రూ.4,790 ఉండగా.. ప్రస్తుతం రూ.5,800 నుంచి రూ.6,200 వరకు పన్నుల భారం పెంచారు. ఇక డెడ్రెంట్లు విషయానికి వస్తే ఒక హెక్టారుకు గతంలో రూ.1.30 లక్షలు ఉండగా, ప్రస్తుతం రూ.1.50లక్షలకు పెంచేశారు. గనుల శాఖ ఒక క్యూబిక్ మీటర్కు 2.75 టన్నుల కింద లెక్కలు వేసుకోగా, బ్లూ గ్రానైట్ వైర్సా కటింగ్ జరిగినా మూడు టన్నులకు తగ్గడం లేదు. వీటిపై శాస్ర్తీయ సర్వే జరగకుండానే పన్నులు పెంచేశారని గ్రానైట్ పరిశ్రమల యజమానులు ఆరోపిస్తున్నారు. వైసీపీ హయాంలో పెంచిన కన్సడరైజేషన్ ఫీజులను కూటమి ప్రభుత్వం తొలగించినట్లే తొలగించి.. టన్నుల రూపంలో సీనరీస్ చార్జీలు పెంచేసిందని పేర్కొంటున్నారు. నీలిరంగు గ్రానైట్ పరిశ్రమకు పన్నుపోటు గుదిబండగా మారిందని నిట్టూర్చుతున్నారు.