NIgha : తీరంపై నిఘా
ABN , Publish Date - May 08 , 2025 | 11:58 PM
Coastal Surveillance జిల్లావ్యాప్తంగా తీర ప్రాంతాల్లో అలజడి నెలకొంది. పహల్గాంకు ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పాకిస్థాన్ ఉగ్రస్థావరాలపై భారత్ క్షిపణి దాడులు చేసింది. ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఈ నేపథ్యంలో మళ్లీ పాక్ ప్రతీకార దాడికి పాల్పడే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. తీరం గుండా మత్స్యకారుల ముసుగులో ఉగ్రవాదులు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందన్న హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తీరప్రాంతాలపై నిఘా పెంచి.. సాగర్కవచ్ నిర్వహిస్తోంది.

జిల్లావ్యాప్తంగా కొనసాగుతున్న తనిఖీలు
మత్స్యకారులకు అవగాహన కల్పిస్తున్న పోలీసులు
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో చర్యలు
మూడేళ్ల కిందట శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. కరోనా వ్యాప్తి తరువాత ఆ దేశ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారింది. నిత్యావసరాల ధరలు సైతం వందల రెట్లు పెరిగిపోవడంతో ఆ దేశ భవిత ప్రశ్నార్థకంగా మారింది. ఆ సమయంలో శ్రీలంక శరణార్థులు మన దేశంలోకి వచ్చేందుకు ప్రయత్నించారు. ముఖ్యంగా తీరప్రాంతం గుండా ఆంధ్రాలోని 11 జిల్లాలకు చేరినట్టు అప్పట్లో కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరించడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
తాజాగా దేశంలో ఉగ్రదాడులు పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. పాకిస్థాన్లో ఉగ్రవాద స్థావరాలపై భారత్ ‘ఆపరేషన్ సిందూర’ పేరిట క్షిపణి దాడి చేసింది. దీంతో ఉగ్రస్థావరాలు నేలకొరిగాయి. పదుల సంఖ్యలో ఉగ్రవాదులు మృతిచెందారు. ఈ తరుణంలో ప్రతీకార దాడులు ఉంటాయని అనుమానంతో దేశంలో అన్ని తీర ప్రాంతాలకు హెచ్చరికలు వచ్చాయి. దీంతో జిల్లాలోని తీరప్రాంతంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తూ.. ముందస్తుగా భద్రతా చర్యలు చేపడుతున్నారు.
రణస్థలం, మే 8(ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా తీర ప్రాంతాల్లో అలజడి నెలకొంది. పహల్గాంకు ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పాకిస్థాన్ ఉగ్రస్థావరాలపై భారత్ క్షిపణి దాడులు చేసింది. ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఈ నేపథ్యంలో మళ్లీ పాక్ ప్రతీకార దాడికి పాల్పడే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. తీరం గుండా మత్స్యకారుల ముసుగులో ఉగ్రవాదులు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందన్న హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తీరప్రాంతాలపై నిఘా పెంచి.. సాగర్కవచ్ నిర్వహిస్తోంది. జిల్లాలో రణస్థలం మండలం దోనిపేట నుంచి ఇచ్ఛాపురం మండలం డొంకూరు వరకూ 193 కిలోమీటర్ల మేర సముద్ర తీరం విస్తరించి ఉంది. రణస్థలం, ఎచ్చెర్ల, శ్రీకాకుళం రూరల్, గార, పోలాకి, సంతబొమ్మాళి, వజ్రపుకొత్తూరు, మందస, సోంపేట, కవిటి, ఇచ్ఛాపురం మొత్తంగా 11 తీరప్రాంత మండలాలు ఉన్నాయి. ఆయా తీరప్రాంతాల్లో పోలీసులు, మెరైన్ పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. మత్స్యకారులను అప్రమత్తం చేస్తున్నారు. కొత్తవారు కనిపిస్తే పోలీస్స్టేషన్కు సమాచారమందించాలని సూచిస్తున్నారు.
అరకొర వసతులు.. సిబ్బంది కొరత
తీర ప్రాంత పరిరక్షణ మెరైన్ పోలీసుల బాధ్యత. కానీ జిల్లాలో కేవలం భావనపాడు, కళింగపట్నం, బారువలో మాత్రమే మెరైన్ పోలీస్స్టేషన్లు ఉన్నాయి. సిబ్బంది అరకొరగానే ఉన్నారు. తీరంలో గస్తీకి ఆధునిక పరికరాలు లేవు. దీంతో క్రైమ్, ఇతరత్రా పోలీస్ సిబ్బందే అత్యవసర సమయాల్లో విధులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో మరికొన్ని చోట్ల మెరైన్ పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. ప్రతిపాదనలకే పరిమితమవుతున్నాయి. ఒక్కో మెరైన్ పోలీస్స్టేషన్కు ఒక సీఐ, ఇద్దరు ఎస్ఐలు, ముగ్గురు ఏఎస్ఐలతోపాటు ఇతర సిబ్బంది 40మంది వరకూ ఉండాలి. కానీ ఏ స్టేషన్లో కూడా పది మంది సిబ్బంది కూడా లేరు. మరోవైపు తీరంలో గస్తీ కోసం ఎటువంటి పరికరాలు, యంత్రాలు లేవు. ఆధునిక బైనాక్యులర్లు లేవు. తీరంలో వెళ్లేందుకు, పర్యవేక్షించేందుకు బోట్లు సైతం లేవు. సముద్రంలో మత్స్యకారులు చిక్కుకున్నప్పుడు, సముద్ర స్నానాలకు దిగి ప్రజలు గల్లంతైనప్పుడు మెరైన్ పోలీసులు మత్స్యకారులపైనే ఆధారపడుతున్నారు. వారి బోట్లకు ఆయిల్ పోసుకొని ఆచూకీకి వెతుకుతున్నారు. కొన్నేళ్ల కిందట ప్రభుత్వం రూ.5కోట్లతో అత్యాధునిక బోట్లు మంజూరు చేసింది. కానీ నిర్వహణ సరిగ్గా లేక ఆ బోట్లు మూలకు చేరాయి. ఇలా అరకొర వసతులు, సిబ్బంది కొరతతో తీరప్రాంతంలో భద్రతా చర్యలు ఆశించిస్థాయిలో ఉండడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మెరైన్ పోలీస్స్టేషన్లను బలోపేతం చేయడంతో పాటు సిబ్బందిని నియమించాలని పలువురు కోరుతున్నారు.
భద్రతకు పెద్దపీట
జిల్లాలో తీరప్రాంతంపై ప్రత్యేక దృష్టిపెట్టాం. సాధారణ, మెరైన్ పోలీసులతో కలిపి మత్స్యకారులకు అవగాహన కల్పిస్తున్నాం. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారమందించాలని సూచిస్తున్నాం. తీరప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించాం. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉంది.
- కేవీ మహేశ్వరరెడ్డి, ఎస్పీ, శ్రీకాకుళం