చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి
ABN , Publish Date - Nov 11 , 2025 | 12:28 AM
శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మొగిలి దివ్య(16) సోమవారం మృతి చెందినట్టు ఎస్ఐ దుర్గాప్రసాద్ తెలిపారు.
నరసన్నపేట, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మొగిలి దివ్య(16) సోమవారం మృతి చెందినట్టు ఎస్ఐ దుర్గాప్రసాద్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జమ్ము పంచాయతీ గెడ్డయ్యపేటకు చెందిన దివ్య గత నెల 9న గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.. వెంటనే కుటుంబ సభ్యులు గుర్తించి శ్రీకాకుళంలో పలు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందజేయడంతో కోలుకుంది. ఈ క్రమంలో దివ్య రెండు రోజులు కిందట వాంతులు చేసుకుంటుండడంతో శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తన సోదరుడు తీసుకువెళ్లగా.. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందింది. ఎస్ఐ దుర్గాప్రసాద్ దర్యాప్తు చేస్తున్నారు. కాగా దివ్య జలుమూరు మండలం కరవంజ మోడల్ స్కూల్లో ఇంటర్ చదువుతోంది.
పాముకాటుతో రైతు కూలీ..
జలుమూరు, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): పర్లాం పంచాయతీ యాతపేటకు చెందిన రైతు కూలీ వాడ సింహాచలం (55) పాముకాటుకు గురై సోమవారం మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సింహాచలం కోత మిషన్పట్టుకొని వరిచేను కోతకు వెళ్లాడు. పొలంలో వరిచేను కోత కోస్తుంగా పాము కాటు వేయడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఇది గమ నించిన స్థానికులు చికిత్స నిమిత్తం సమీపంలో గల సైరిగాం పీహెచ్సీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో బుడితి సీహెచ్సీకి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈయనకు భార్య పుణ్యావతి, కుమారుడు, వివాహమైన కుమార్తె ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ బి.అశోక్బాబు తెలిపారు.