cultural : సిక్కోలు.. సాహిత్యవేత్తలకు నిలయం
ABN , Publish Date - May 11 , 2025 | 11:23 PM
Writers Literary Hub ‘పోరాటాలకు, సాహిత్యవేత్తలకు ప్రాణం పోసిన గడ్డ శ్రీకాకుళం. ఈ జిల్లా నుంచి ఎంతోమంది కవులు ఉన్నార’ని జాతీయ ఉత్తమ సినీ గేయ రయయిత, తెలుగు సాహిత్యకారుడు సుద్దాల అశోక్ తేజ అన్నారు.
జాతీయ ఉత్తమ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ
గుజరాతీపేట, మే 11(ఆంధ్రజ్యోతి): ‘పోరాటాలకు, సాహిత్యవేత్తలకు ప్రాణం పోసిన గడ్డ శ్రీకాకుళం. ఈ జిల్లా నుంచి ఎంతోమంది కవులు ఉన్నార’ని జాతీయ ఉత్తమ సినీ గేయ రయయిత, తెలుగు సాహిత్యకారుడు సుద్దాల అశోక్ తేజ అన్నారు. ఆదివారం శ్రీకాకుళంలోని బాపూజీ కళామందిరంలో సాహితీ స్రవంతి, శ్రీకాకుళ సాహితీ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ శూద్రగంగ కావ్య గాన సభ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. ‘శ్రీకాకుళం అంటేనే సూర్యగోళమని నా తండ్రి, కవి అయిన సుద్దాల హనుమంతు నాకు చిన్నప్పుడు చెప్పేవారు. పోరాటాల గడ్డగా అభివర్ణించేవారు. నా తండ్రి నుంచి సంక్రమించిన సాహిత్యాలు, గేయాలు రాయడం వలన సినీరంగంలో సుమారు మూడు వేలకు పైగా పాటలు రాశాను. ఠాగూర్ సినిమాలో రాసిన ‘నేను సైతం’ పాటకు ఉత్తమ సాహిత్య జాతీయ చలన చిత్ర అవార్డు రావడం గర్వకారణం. రచనా రంగం నుంచి సినీరంగం, పుస్తకాలు ప్రచురణతో ఎన్నో పురస్కారాలు అందుకున్నా’నని సుద్దాల అశోక్ తేజ తెలిపారు. అనంతరం స్వయంగా రాసిన సాహిత్యాలు చదివి, గేయాలను ఆలపించగా కవులు, కళాభిమానులు చప్పట్లతో కళా ప్రాంగణం మార్మోగింది. కార్యక్రమంలో సభాధ్యక్షుడు కె.శ్రీనివాస్, కవి అట్టాడ అప్పలనాయుడు, జి.గౌరునాయుడు, కంచరాన భుజంగరావు, కె.ఉదయ్కిరణ్, ఎస్.రుద్రమ రాణి, సీహెచ్ దివాకర్, కె.శ్రీనివాసరావు, రంగనాథం, కల్లేపల్లి రాంగోపాల్, పి.మోహనరావు, చింతాడ తిరుమలరావు, బాడాన శ్యామలరావు, ఎన్.రమణ, పూజారి దివాకర్ పాల్గొన్నారు.