Drugs: మాదకద్రవ్యాల రవాణాపై ప్రత్యేక నిఘా
ABN , Publish Date - May 09 , 2025 | 11:36 PM
Drug trafficking.. Police monitoring మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టేందుకు కఠినచర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా యాక్షన్ కమిటీ సమావేశం నిర్వహించారు.

కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం కలెక్టరేట్, మే 9(ఆంధ్రజ్యోతి): మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టేందుకు కఠినచర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా యాక్షన్ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ‘విద్యార్థులు, వర్కర్లు, ఆటోడ్రైవర్లే లక్ష్యంగా జరుగుతున్న మత్తు పదార్థాల సరఫరాను గుర్తించాలి. డ్రగ్స్ విక్రయాల ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేయాలి. బాధితులకు కౌన్సెలింగ్, పునరావాసం కల్పించాలి. పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలి. మెడికల్ షాపుల్లో సీసీ కెమెరాలు అమర్చాలి. ప్రిస్కిప్షన్ లేకుండా 18ఏళ్ల లోపు వారికి మందులు ఇవ్వరాదని సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి. సోషల్ మీడియాలో డ్రగ్స్రహిత సమాజం కోసం ప్రచారం నిర్వహించాలి. గ్రామస్థాయిలో ఆశావర్కర్లు, మహిళా పోలీసులు, ఏఎన్ఎంలు, అంగన్వాడీలతో పర్యవేక్షణ చేపట్టాల’ని ఆదేశించారు. మత్తు పదార్థాల నివారణకు సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించారు.
ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ ‘ఈగల్ టీమ్తో మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రత్యేక నిఘా పెట్టాం. డ్రగ్స్ సమాచారం కోసం 112 లేదా 1972 నెంబర్లకు ఫోన్ చేయాలి. జీజీహెచ్లో(రిమ్స్) డీ-అడిక్షన్ సెంటర్ను అందుబాటులో ఉంచుతాం. హాస్టళ్లలో డ్రగ్స్ వాడకంపై పర్యవేక్షిస్తాం. పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్ల పరిసరాల్లో బోర్డులు ఏర్పాటు చేస్తామ’ని తెలిపారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు కఠినచర్యలు
జిల్లాలో రోడ్డుభద్రతా చర్యలను మరింత కఠినతరం చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన రహదారుల భద్రతా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ఎన్ఫోర్స్మెంట్ చర్యలను బలోపేతం చేయాలి. డివైడర్లను తొలగిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి. ఇటీవల జరిగిన ప్రమాదాలపై ఇంజనీరింగ్ అధికారులు విశ్లేషణ చేయాలి. 108 వాహన సేవలు అందుబాటులో ఉండాలి. పాఠశాలలు, కళాశాలల వద్ద స్పీడ్ బ్రేకర్లు, మలుపుల వద్ద బారీకేడ్లు, ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలి. పెట్రోలు బంకుల వద్ద సీసీ కెమెరాలు అమర్చాలి. బ్లాక్స్పాట్స్ గుర్తించి డ్రైవర్ల కోసం రెస్ట్రూమ్లు ఏర్పాటు చేయాలి. అతివేగం, డ్రైవింగ్ లైసెన్సు లేకుండా వాహనం నడిపేవారిపై కఠినచర్యలు తీసుకోవాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలి. కమర్షియల్ ప్రాంతాల్లో మునిసిపల్ కమిషనర్లు చర్యలు చేపట్టాలి. ట్రామాకేర్ సెంటర్ల ఏర్పాటు కోసం వైద్యారోగ్యశాఖ చర్యలు తీసుకోవాలి. విద్యాసంస్థల్లో రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల’ని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ డి.పృథ్వీరాజ్కుమార్, ఆర్అండ్బీ ఎస్ఈ సుధాకర్, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ విజయసారథి, ఇతర అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.