గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి
ABN , Publish Date - Dec 27 , 2025 | 12:29 AM
Marijuana eradication కాశీబుగ్గ డివిజన్లో ఎక్కువగా ఒడిశా సరిహద్దులు ఉండడంతో గంజాయి అక్రమ రవాణా అధికంగా జరుగుతోందని డీఎస్పీ షేక్ సహబాబజ్ అహ్మద్ అన్నారు.
- డీఎస్పీ షేక్సహబాజ్ అహ్మద్
పలాస, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): కాశీబుగ్గ డివిజన్లో ఎక్కువగా ఒడిశా సరిహద్దులు ఉండడంతో గంజాయి అక్రమ రవాణా అధికంగా జరుగుతోందని డీఎస్పీ షేక్ సహబాబజ్ అహ్మద్ అన్నారు. దీనిపై ప్రత్యేక దృష్టి సారించి... నిర్మూలనకు కృషి చేస్తామన్నారు. ఈ మేరకు శుక్రవారం డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను గతంలో పాడేరు డీఎస్పీగా విధులు నిర్వహించానని, కాశీబుగ్గలో బాధ్యతలు స్వీకరించడం సంతోషకరంగా ఉందన్నారు. డివిజన్ పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించి... పోలీసు అధికారుల సహకారంతో శాంతిభద్రతలు కాపాడేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. చోరీ కేసులు ఎక్కువగా ఉన్నందున సీసీ కెమెరాల ఏర్పాటు, మహిళా భద్రత కోసం నారీశక్తి వంటి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. సబ్డివిజన్లో రౌడీషీటర్లు, అనుమానితుల కదలికలను గుర్తించి ఎటువంటి నేరాలకు పాల్పడినా కఠినచర్యలు తప్పవని స్పష్టం చేశారు.