అంతటా అభివృద్ధి చెందాలి
ABN , Publish Date - Nov 28 , 2025 | 11:47 PM
Assembly Estimates Committee Chairman meeting రాష్ట్రమంతా అభివృద్ధి చెందాలని రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్ వి.జోగేశ్వరరావు పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో 2019 నుంచి 2022 వరకు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన అంచనాలను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, స్థానిక ఎమ్మెల్యే గొండుశంకర్, కమిటీ సభ్యులు వరుదు కళ్యాణి(ఎమ్మెల్సీ), ఇతర అధికారులతో సమీక్షించారు.
సమస్యల పరిష్కారానికి కృషిచేస్తాం
శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్ జోగేశ్వరరావు
శ్రీకాకుళం కలెక్టరేట్, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్రమంతా అభివృద్ధి చెందాలని రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్ వి.జోగేశ్వరరావు పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో 2019 నుంచి 2022 వరకు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన అంచనాలను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, స్థానిక ఎమ్మెల్యే గొండుశంకర్, కమిటీ సభ్యులు వరుదు కళ్యాణి(ఎమ్మెల్సీ), ఇతర అధికారులతో సమీక్షించారు. ఆ మూడేళ్లలో అంచనాల అమలు, నిధుల వ్యయం, సాధించిన పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ వివరించారు. హాస్టళ్ల నిర్వహణ, వివిధ పథకాల అమలు, రుణాల మంజూరు, వైద్యసేవలు తదితర అంశాలపై కమిటీ చైర్మన్ జోగేశ్వరరావు ఆరా తీశారు. వివిధ సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక అందజేసి.. వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
జిల్లాలో హాస్టళ్లను సక్రమంగానే నిర్వహిస్తున్నామని, ప్రభుత్వం విడుదల చేసిన రూ.4లక్షలు, కలెక్టర్ మంజూరు చేసిన నిధులతో బాత్రూమ్లు బాగుచేయిస్తున్నామని సాంఘిక సంక్షేమశాఖ డీడీ తెలిపారు. ప్రతీ విద్యార్థికి ప్రొఫైల్ ప్రకారం హాజరు రిజిస్టర్ అవుతోందన్నారు. బీసీ హాస్టళ్లలో ఖాళీలు ఉన్నచోట్ల ఇన్చార్జిలను నియమించామని తెలిపారు. సాంఘిక సంక్షేమ శాఖలో రూ.6కోట్ల వరకు ఫీజు రీయింబర్స్మెంట్ ఉందన్నారు. ఉమ్మడి జిల్లాలో గిరిజన హాస్టళ్ల పనితీరుపై ఇంతవరకూ సమీక్ష నిర్వహించలేదని పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తెలిపారు. వెంటనే సమీక్ష నిర్వహించాలని, రెండు రోజుల్లో నివేదిక అందజేయాలని చైర్మన్ కోరారు.
జిల్లాలో వివిధ గ్రూపులకు రూ.1200కోట్లు రుణాలు ఇచ్చామని డీఆర్డీఏ పీడీ కిరణ్కుమార్ తెలిపారు.
జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, అమలు చేస్తున్న పోషకాహారం, పిల్లలకు విద్య, మిషన్ వాత్సల్య, బాల్య వివాహాలు, తదితర వివరాలను ఐసీడీఎస్ పీడీ విమల వివరించారు.
జలజీవన్ మిషన్లో భాగంగా పాతపట్నం, శ్రీకాకుళం, టెక్కలి నియోజకవర్గాల్లో కొన్ని పనులు రద్దయ్యాయని, వాటి పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కమిటీని కోరారు.
డీఎంహెచ్వో డాక్టర్ కె.అనిత మాట్లాడుతూ జిల్లాలో అన్ని 104, 108 వాహనాలు కండీషన్లో ఉన్నాయని తెలిపారు.
పాఠశాల అకౌంట్లకు నేరుగా నిధులు జమవుతున్నాయని, నిర్వహణ విషయంలో సమస్యలు లేవని డీఈవో తెలిపారు. బాలికలకు గుడ్టచ్, బ్యాడ్ టచ్పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
జిల్లాలో రైతులకు అందిస్తున్న పథకాలు, సేవలు, సబ్సిడీల గురించి వ్యవసాయాధికారి త్రినాథస్వామి వివరించారు. ఇటీవల తుఫాన్ కారణంగా జిల్లాలో 1,627 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో అంచనాల కమిటీ సభ్యులు రాజాకుమార్, వి.భిక్షం, సెక్షన్ అధికారి టి.చిరంజీవి, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఇన్చార్జి డీఆర్వో లక్ష్మణమూర్తి, ఆర్డీవో సాయిప్రత్యూష, జడ్పీ సీఈవో సత్యనారాయణ, సీపీఓ ప్రసన్నలక్ష్మి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.