Muscat : మస్కట్ నుంచి క్షేమంగా స్వదేశానికి...
ABN , Publish Date - May 09 , 2025 | 11:31 PM
Muscat to Safe return ఉపాధి కోసం మస్కట్ వెళ్లి... అక్కడ చిక్కుకుపోయిన జిల్లాకు చెందిన కార్మికులు ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు చొరవతో క్షేమంగా రాగలిగారు. ఇచ్ఛాపురం ప్రాంతానికి చెందిన కార్మికులు ఓ ప్రైవేటు కంపెనీ చేతిలో మోసపోయి.. నెలల తరబడి మస్కట్లో మగ్గిపోయారు.

కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు చొరవతో ఇళ్లకు చేరిన కార్మికులు
శ్రీకాకుళం, మే 9(ఆంధ్రజ్యోతి): ఉపాధి కోసం మస్కట్ వెళ్లి... అక్కడ చిక్కుకుపోయిన జిల్లాకు చెందిన కార్మికులు ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు చొరవతో క్షేమంగా రాగలిగారు. ఇచ్ఛాపురం ప్రాంతానికి చెందిన కార్మికులు ఓ ప్రైవేటు కంపెనీ చేతిలో మోసపోయి.. నెలల తరబడి మస్కట్లో మగ్గిపోయారు. కొన్ని నెలలు పాటు పని, జీతం లేకుండా.. అర్థాకలితో అల్లాడిపోయారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఆ సమాచారాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు దృష్టికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి మస్కట్లోని భారత దౌత్య కార్యాలయ అధికారులతోనూ.. టీడీపీ ఎన్ఆర్ఐ విభాగంతో సమన్వయం చేసి .. కార్మికులకు తక్షణ వసతి, ఆహారం అందేలా చర్యలు తీసుకున్నారు. అనంతరం ఇక్కడికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో ముంబై విమానాశ్రయ అధికారులతో మాట్లాడి ఆహారం సమకూర్చేలా చేశారు. ముంబై నుంచి శ్రీకాకుళం వరకు ప్రయాణ ఖర్చులు భరించి తొమ్మిది మందిని సురక్షితంగా స్వస్థలాలకు చేర్పించారు. వీరంతా తమ ఊళ్లకు చేరుకుని.. కుటుంబ సభ్యులను కలసిన అనంతరం కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. విదేశంలో పని లేక ఆకలితో తీవ్రంగా ఇబ్బంది పడ్డామని..అత్యంత వేగంగా సాయం చేశారని కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు స్పంది స్తూ...‘రాజకీయాలకు అతీతంగా ప్రజల సమస్యలే తనకు ముఖ్యమని.. ఎక్కడైనా ఎవరికైనా సాయం అవసరమైతే వెంటనే తెలియజేయండి’ అని సూచించారు.