cm tour: సీఎం పర్యటనకు పటిష్ఠ బందోబస్తు
ABN , Publish Date - Apr 26 , 2025 | 12:12 AM
CM visit security arrangements సీఎం చంద్రబాబునాయుడు పర్యటన సందర్భంగా పటిష్ఠమైన బందోబస్తును ఏర్పాటు చేశామని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు. శుక్రవారం బుడగట్లపాలెంలో బందోబస్తు విధి విఽధానాలపై పోలీసు అధికారులకు, సిబ్బందికి సూచనలు చేశారు.
ఎచ్చెర్ల, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబునాయుడు పర్యటన సందర్భంగా పటిష్ఠమైన బందోబస్తును ఏర్పాటు చేశామని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు. శుక్రవారం బుడగట్లపాలెంలో బందోబస్తు విధి విఽధానాలపై పోలీసు అధికారులకు, సిబ్బందికి సూచనలు చేశారు. అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. ‘సీఎం కాన్వాయ్ వెళ్లే సమయంలో సామాన్య ప్రజానీకానికి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టాలి. కేటాయించిన స్థలాల్లోనే వాహనాలు పార్కింగ్ చేయాలి. సిబ్బందితో సమన్వయం చేసుకుని ఇన్చార్జి అధికారులు అవసరమైన రోప్ పార్టీ, స్పెషల్ పార్టీలను సిద్ధంగా ఉంచుకోవాలి’ అని తెలిపారు.
ఎస్పీ మహేశ్వరరెడ్డి పర్యవేక్షణలో నలుగురు ఏఎస్పీలు, 8 మంది డీఎస్పీలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బందితో కలిపి మొత్తం 1500 మందితో పటిష్ఠమైన బందోబస్తును ఏర్పాటుచేశారు. 17 రోప్ పార్టీలు, స్పెషల్ పార్టీలు, క్యూఆర్డీ టీమ్లను ప్రత్యేకంగా సిద్ధం చేశారు. ఎస్పీ పర్యవేక్షణలో పోలీసులు ట్రయల్ రన్ నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎస్పీలు కె.దిరాజ్, పి.శ్రీనివాసరావు, కేవీ రమణ, దేవాప్రసాద్, సీఎం సెక్యూరిటీ వింగ్ ఏఎస్పీ ఏవీ రమణ, డీఎస్పీలు పాల్గొన్నారు.
ఏర్పాట్ల పరిశీలన
బుడగట్లపాలెంలో సీఎం పర్యటనకు సంబంధించి అధికారులు ఏర్పాట్లను పూర్తిచేశారు. శుక్రవారం బుడగట్లపాలెంలో సభ భద్రత ఏర్పాట్లను విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి పరిశీలించారు. హెలిప్యాడ్, సభా వేదిక, లబ్ధిదారుల కలయిక, కార్యకర్తలతో సమావేశం, అమ్మవారి ఆలయ దర్శనం, వాహనాల పార్కింగ్, తదితర వాటిని ఎస్పీతో కలిసి పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.