Road works: నాణ్యతా ప్రమాణాలతో రహదారులు నిర్మించాలి
ABN , Publish Date - Jun 10 , 2025 | 12:13 AM
Road construction Quality standards రహదారుల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పక్కాగా ఉండాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులకు ఆదేశించారు. ఎక్కడైనా నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

- ఈ నెల 12 నుంచి 18లోపు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయాలి
- అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశం
టెక్కలి, జూన్ 9(ఆంధ్రజ్యోతి): రహదారుల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పక్కాగా ఉండాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులకు ఆదేశించారు. ఎక్కడైనా నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సోమవారం కోటబొమ్మాళి మండలం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి అచ్చెన్న మాట్లాడుతూ.. ‘రూ.1.75 కోట్లతో జాతీయ రహదారి నుంచి వయా చాకిపల్లి, డీపీఎన్ రోడ్డు వరకు, రూ.1.25 కోట్ల నాబార్డు నిధులతో కొల్లిపాడు-మేఘవరం రహదారి పనులు చేపట్టాలి. పంచాయతీరాజ్ పరిధిలో రూ.6కోట్లతో పెంటూరు నుంచి పొల్లాడ వరకు బీటీ రోడ్డు, రూ.1.95 కోట్లతో జల్లపల్లి నుంచి సీతారాంపల్లి వరకు, రూ.3కోట్లతో బడబంద నుంచి రౌతుపురం వరకు, రూ.1.10 కోట్లతో బీఆర్సీ పురం నుంచి సైలాడ వరకు అవసరమైన బీటీ రోడ్ల నిర్మాణాలు చేపట్టాలి. ఉపముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ మాటామంతీ కార్యక్రమంలో భాగంగా రావివలసకు మంజూరు చేసిన రూ.15కోట్లతో వివిధ అభివృద్ధి పనులు శరవేగంతో ప్రారంభించాలి. ఈనెల 12 నుంచి 18లోగా పలు రోడ్లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయాల’ని ఆదేశించారు. అలాగే రైతులకు లాభసాటిగా ఉండేలా వరిని తగ్గించి ఆయిల్పామ్ విస్తీర్ణం పెంచేలా చర్యలు చేపట్టాలని ఉద్యానశాఖ ఏడీ కరుకోల చిట్టిబాబుకు సూచించారు. సమావేశంలో ఆర్అండ్బీ ఈఈ పి.సత్యనారాయణ, డీఈఈ రవికాంత్, పంచాయతీరాజ్ డీఈఈ సుధాకర్, ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.