ఐబీఎం క్వాంటమ్ ఫెస్ట్కు ఆర్జీయూకేటీ శ్రీకాకుళం క్యాంపస్ ఎంపిక
ABN , Publish Date - Oct 09 , 2025 | 12:10 AM
ఐబీఎం క్వాంటమ్ క్విస్కిట్ పాల్ ఫెస్ట్-2025కు ఆర్జీయూకేటీ శ్రీకాకుళం క్యాంపస్ ఎంపికైంది.
ఎచ్చెర్ల, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): ఐబీఎం క్వాంటమ్ క్విస్కిట్ పాల్ ఫెస్ట్-2025కు ఆర్జీయూకేటీ శ్రీకాకుళం క్యాంపస్ ఎంపికైంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఫెస్ట్ నిర్వహణకు 55 విశ్వ విద్యాలయాలను మాత్రమే ఎంపిక చేశారు. రాష్ట్ర నుంచి ఏకైక సంస్థగా ఆర్జీయూకేటీ శ్రీకాకుళం క్యాంపస్ ఎంపిక కావడం విశేషం. ఈ క్యాంపస్ విద్యార్థులు కాటం నిఖిల్తేజ, కాసిం వాలి దూదేకుల, ప్రవీణ్కుమార్ చెరుకూరి, జాన్బాబు చదువుల, గుణశ్రీ కిమిడి ఇచ్చిన ప్రజెంటేషన్ కారణంగా ఫెస్ట్కు ఎంపికైంది. ఈ ఫెస్ట్ను ఈ నెల 21 నుంచి 27వరకు ఆర్జీయూకేటీ పరిధిలోని నాలుగు క్యాంపస్లు శ్రీకాకుళం, నూజివీడు, ఒంగోలు, ఆర్కే వ్యాలీలో జరగనుంది. ఇందులో దేశ వ్యాప్తంగా విద్యార్థులు, పరిశోధకులు, సాంకేతిక నిపుణులు ప్రత్యక్షంగా, ఆన్లైన్ ద్వారా పాల్గొనున్నారు. క్వాంటం కంప్యూటింగ్ అభివృద్ధి, ఈ రంగంలో ఉన్న అవకాశాలపై వర్క్షాపులు, నిపుణుల ఉపన్యాసాలు కూడా ఉంటాయి. ఈ ఫెస్ట్కు కన్వీనర్గా అకడమిక్స్ డీన్ శివరామకృష్ణ వ్యవహరించనున్నారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్ను క్యాంపస్ డైరెక్టర్ కేవీజీడీ బాలాజీ బుధవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏవో ముని రామకృష్ణ, ఫైనాన్స్ ఆఫీసర్ సీహెచ్.వాసు, స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ జి.రవి, డిప్యూటీ ఏవో సూరి గణేష్ తదితరులు పాల్గొన్నారు.