Share News

‘జగతిమెట’్ట అక్రమాలపై రెవెన్యూ కొరడా

ABN , Publish Date - Apr 10 , 2025 | 12:13 AM

జగతిమెట్ట దరి జగనన్న ఇళ్ల కాలనీ వ్యవహారంలో తవ్వుతున్నకొద్దీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ప్రాంతంలో అధికారుల అనుమతి లేకుండానే పుట్టగొడుగుల్లా ఇళ్లు పుట్టుకొస్తుండడంతో రెవెన్యూ అధికారులు దీనిపై దృష్టి సారించారు.

‘జగతిమెట’్ట అక్రమాలపై రెవెన్యూ కొరడా
జగతిమెట్ట కాలనీలో అక్రమ పునాదులను తొలగిస్తున్న రెవెన్యూ అధికారులు

  • తహసీల్దార్‌, ఇద్దరు వీఆర్‌వోలు, ఒక ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ కీలకం

  • అధికారుల నిర్ధారణ

  • 23 చోట్ల పునాదుల తొలగింపు

టెక్కలి, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): జగతిమెట్ట దరి జగనన్న ఇళ్ల కాలనీ వ్యవహారంలో తవ్వుతున్నకొద్దీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ప్రాంతంలో అధికారుల అనుమతి లేకుండానే పుట్టగొడుగుల్లా ఇళ్లు పుట్టుకొస్తుండడంతో రెవెన్యూ అధికారులు దీనిపై దృష్టి సారించారు. బుధవారం ఒక్కరోజే 23 అక్రమ పునాదులను రెవెన్యూ అధికారులు తొలగించారు. డి.పట్టా భూములుగా రైతుల ఆధీనంలో కొన్నాళ్లు ఉండడంతో ఈ స్థలంలో 70మందికి అప్పటి రెవెన్యూ అధికారులు ఇళ్ల పట్టాలు మంజూరు చేశారు. అందులో 40 ఇళ్ల స్థలాలు నఖిలీవని రెవెన్యూ అధికారులు గుర్తించారు. తహశీల్దారు సహా అందరి సంతకాలను ఓ వీఆర్వో ఫోర్జరీ చేసి.. పట్టాలను అందజేశారు. అప్పట్లో అక్రమాల్లో తహశీల్దార్‌ బెండి గిరి, వీఆర్‌వోలు మల్లేశ్వరరావు, వైకుంఠరెడ్డితో పాటు ఓ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ సూత్రధారులుగా ఉన్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించి, వారిపై చర్యలకు సిద్ధమవుతున్నారు. వాస్తవాలు వెలికితీసిన తరువాత వారిపై క్రిమినల్‌ కేసుల నమోదుకు ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి రంగం సిద్ధం చేశారు. జగనన్న ఇళ్ల కాలనీలో ఇష్టారాజ్యంగా పట్టాలు జారీ చేసి... అక్రమాలకు పాల్పడిన ఏ ఒక్క వ్యక్తినీ విడిచిపెట్టేది లేదని, వారిపై క్రిమినల్‌ చర్యలకు వెనుకాడబోమని ఆర్డీవో తెలిపారు. వాస్తవానికి 389 ఇళ్ల పట్టాలు ఇవ్వగా... 412 పట్టాలు పుట్టుకొచ్చాయని, ఇందులో అనర్హులకు అప్పటి రెవెన్యూ అధికారులు, సిబ్బంది పెద్దపీట వేసి అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే మరిన్ని అక్రమాలు బయట పడతాయని, మరింతమంది రెవెన్యూ సిబ్బందిపై వేటు తప్పదన్నారు.

Updated Date - Apr 10 , 2025 | 12:13 AM