కిడ్నీవ్యాధుల పరిశోధనకు సిద్ధం
ABN , Publish Date - Nov 28 , 2025 | 11:44 PM
kidney disease research ఉద్దానంలో కిడ్నీవ్యాధులపై పరిశోధనకు రంగం సిద్ధమైంది. కిడ్నీవ్యాధుల మూలాల పరిశోధన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రవిరాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని నియమించిన విషయం తెలిసిందే. ఈ మేరకు శుక్రవారం బృందం సభ్యులు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషను కలిశారు.
ఎమ్మెల్యే శిరీషను కలిసిన డాక్టర్ రవిరాజ్ బృందం
పలాస, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): ఉద్దానంలో కిడ్నీవ్యాధులపై పరిశోధనకు రంగం సిద్ధమైంది. కిడ్నీవ్యాధుల మూలాల పరిశోధన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రవిరాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని నియమించిన విషయం తెలిసిందే. ఈ మేరకు శుక్రవారం బృందం సభ్యులు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషను కలిశారు. ఉద్దానంలో కిడ్నీ వ్యాధులను గుర్తించడానికి సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. రెండేళ్లపాటు ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో డాక్టర్ రవిరాజ్ బృందం ఉద్దానం గ్రామాల్లో వివిధ పరిశోధనలు చేయనుంది. ఇప్పటికే పలాస కిడ్నీ పరిశోధనకేంద్రం ద్వారా రోగులకు మెరుగైన డయాలసిస్ సేవలతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ప్రస్తుతం కేవలం పరిశోధనలకు రూ.6కోట్ల నిధులు విడుదల చేసింది. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తమ గ్లో సంస్థ ద్వారా ఆధునిక పరికరాలుతోపాటు ఐదు డయాలసిస్ యూనిట్లతో సహకారం అందిస్తున్నారు. ఎమ్మెల్యే శిరీష విలేకరులతో మాట్లాడుతూ డాక్టర్ రవిరాజ్ బృందానికి ‘ఉద్దానం కిడ్నీ వ్యాధులపై పూర్తి అవగాహన ఉంది. వ్యాధుల మూలాలు కనుగొనడం కోసం ఆయన చేస్తున్న చర్యలు ప్రశంసనీయం. రక్త నమూనాలు సేకరించే వైద్య బృందానికి ప్రజలు సహకారం అందించాలి. వైద్యబృంద సభ్యులు పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో పర్యటించి.. పరిశోధనలు చేయనున్నార’ని తెలిపారు.