భక్తులకు అనుగుణంగా రథసప్తమి ఉత్సవాలు
ABN , Publish Date - Dec 23 , 2025 | 11:56 PM
Referendum on the 26th భక్తుల మనోభావాలకు అనుగుణంగా రథసప్తమి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడమే జిల్లా యంత్రాంగం లక్ష్యమని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు.
26న ప్రజాభిప్రాయ సేకరణ
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం కలెక్టరేట్, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): భక్తుల మనోభావాలకు అనుగుణంగా రథసప్తమి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడమే జిల్లా యంత్రాంగం లక్ష్యమని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. ‘రానున్న జనవరి 25న జరుగనున్న వేడుకలను ఈసారి ఏడు రోజులపాటు రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు ప్రభుత్వానికి ఇప్పటికే ప్రాతిపాదనలు పంపాం. ముందస్తు ఏర్పాట్లపై చర్చించేందుకు ఈ నెల 26న ఉదయం 10.30 గంటలకు జడ్పీ సమావేశ మందిరంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నాం. గత ఏడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మరింత మెరుగైన సౌకర్యాల కల్పనే ప్రధాన ఉద్దేశం. సమావేశానికి ప్రజాప్రతినిధులు, ఆలయ సంప్రదాయాలు తెలిసిన పెద్దలు, ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, వ్యాపార, వాణిజ్య, రవాణా రంగాల ప్రతినిధులతోపాటు సామాన్య భక్తులు కూడా హాజరై తమ సలహాలను అందజేయాల’ని కలెక్టర్ కోరారు. ముఖ్యంగా ఉత్సవాల నిర్వహణ, భక్తుల సౌకర్యాలు, ట్రాఫిక్ నియంత్రణపై ఎవరైనా తమ అమూల్యమైన సలహాలు అందజేయవచ్చని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో, అరసవల్లి ఆలయ ఈవో, ప్రధాన అర్చకులు, రెవెన్యూ, పోలీసు, మునిసిపల్ తదితర శాఖల అధికారులు పాల్గొనాలని ఆదేశించారు.