వరిలో ఎలుకల బెడద
ABN , Publish Date - Oct 20 , 2025 | 12:15 AM
వరి పంటలో ఎలుకల బెడద ఎక్కువైంది. పొట్ట దశలో పంటపై దాడి చేస్తున్నాయి. పొట్ట భాగాన్ని కొరికేసి తినేస్తున్నాయి.
- పొట్ట దశలో పంటను కొరికేస్తున్న వైనం
- దిగుబడిపై రైతుల్లో ఆందోళన
నరసన్నపేట, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): వరి పంటలో ఎలుకల బెడద ఎక్కువైంది. పొట్ట దశలో పంటపై దాడి చేస్తున్నాయి. పొట్ట భాగాన్ని కొరికేసి తినేస్తున్నాయి. దీంతో పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం పడనుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్లో జిల్లాలో 3.75 లక్షల ఎకరాల్లో రైతులు వరిసాగు చేశారు. విత్తనాలు, ఎరువులు, దమ్ములు, నాట్లు కోసం అధికంగా పెట్టుబడి పెట్టారు. తెగుళ్ల నివారణకు మందులు కూడా స్ర్పే చేశారు. మరో నెల రోజుల్లో పంట చేతికందుతుందన్న సమయంలో ఎలుకలు విజృంభిస్తున్నాయి. దీంతో పంట రక్షణకు రైతులు పడరాని పాట్లుపడుతున్నారు. లక్ష ఎకరాల్లో ఎలుకల దాడి ప్రభావం ఎక్కువగా ఉంది. ఎకరానికి రెండు బస్తాల వరకు నష్టం వస్తుందని రైతులు చెబుతున్నారు. గతేడాది కంటే ఈ ఏడాది సకాలంలో వర్షాలు పడడంతో దిగుబడులు ఎక్కువగా వస్తాయని రైతులు ఆశించారు. అయితే, నల్లదోమ, తెల్లదోమతోపాటు ఎలుకల బెడడతో జిల్లాలో సుమారు 30వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి తగ్గే అవకాశాలు కన్పిస్తున్నాయని రైతులు చెబుతున్నారు.
దిగుబడులు తగ్గుతాయి
వరిలో ఎలుకల బెడద ఏడాదికేడాది పెరుగుతుంది. నా ఎకరా వరి చేనులో 8సెంట్లను పూర్తిగా పాడు చేశాయి. పొట్ట దశలో పంటను కొరికేస్తున్నాయి. మరొక వైపు దోమతో ఈఏడాది వరి దిగుబడులు తగ్గుతాయి. పెట్టుబడులు ఎకరాకు అదనంగా రూ.3వేల వరకు పెరిగాయి.
-కొత్తరెడ్డి కృష్ణారావు, రైతు , జమ్ము