Farmers' issues : ఆ రైతులకు ‘రైల్వే’ కష్టాలు
ABN , Publish Date - Jul 27 , 2025 | 11:45 PM
Railway project impact Agricultural land ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల రైతులకు రైల్వేపరంగా అపార నష్టం జరుగుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. పలాస- ఇచ్ఛాపురం మధ్య మూడో ట్రాక్ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలాస నుంచి ఇచ్ఛాపురం వరకూ రైల్వేట్రాక్కు ఇరువైపులా స్తంభాలు ఏర్పాటు చేస్తున్నారు.
పలాస-ఇచ్ఛాపురం మధ్య మూడోట్రాక్ పనులు
ట్రాక్కు ఇరువైపులా స్తంభాలు పాతుతున్న వైనం
అండర్ టన్నెల్, పాసేజ్ల మార్గాలు మూసివేత
ఇచ్ఛాపురం, జూలై 27(ఆంధ్రజ్యోతి): ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల రైతులకు రైల్వేపరంగా అపార నష్టం జరుగుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. పలాస- ఇచ్ఛాపురం మధ్య మూడో ట్రాక్ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలాస నుంచి ఇచ్ఛాపురం వరకూ రైల్వేట్రాక్కు ఇరువైపులా స్తంభాలు ఏర్పాటు చేస్తున్నారు. చివరకు రైల్వే ఎల్సీ గేట్ల వద్ద కూడా విడిచిపెట్టడం లేదు. కల్వర్టులు, చిన్నపాటి వంతెనల వద్ద ఉన్న మార్గాలను స్తంభాలతో మూసివేస్తుండడంతో రెండు నియోజకవర్గాల రైతులు ఆందోళన చెందుతున్నారు. తమ గ్రామాల చెంతనే రైల్వేట్రాక్కు అడ్డంగా విద్యుత్ స్తంభాలు పాతుతుండడంతో అవతలి ప్రాంతానికి వెళ్లలేని పరిస్థితి నెలకొంటోందని వాపోతున్నారు. తమ సమస్యకు పరిష్కారం చూపాలని ఇటీవల ఇచ్ఛాపురం నియోజకవర్గం రైతులు ఈసుకోస్టు ఖుర్దా రైల్వే డివిజన్ పరిధిలో బరంపురం రైల్వేసెక్షన్ అధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు.
మూడో రైల్వేట్రాక్ ఇలా..
విశాఖ-భువనేశ్వర్ మధ్య మూడో రైల్వేట్రాక్ నిర్మాణానికి భారత రైల్వేశాఖ అనుమతిచ్చింది. ఇందుకు సంబంధించి డీపీఆర్ కూడా పూర్తయింది. విశాఖ నుంచి పలాస మధ్య కొత్తగా ఏర్పడిన దక్షిణ కోస్తా రైల్వేజోన్లో చేర్చారు. పలాస నుంచి ఇచ్ఛాపురం వరకూ 45 కిలోమీటర్ల పరిధిని ఈస్టుకోస్టు రైల్వేజోన్లోనే ఉంచారు. ఇటు విశాఖ, అటు పశ్చిమబెంగాల్, ఝార్ఖండ్, ఛత్తీ్సగఢ్ నుంచి పారిశ్రామిక ఉత్పత్తులు, వనరుల దిగుమతి, ఎగమతి దృష్ట్యా మూడో రైల్వేలైన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విశాఖ కేంద్రంగా ఏర్పాటైన దక్షిణి కోస్తా పరిధిలోని విశాఖ నుంచి పలాస రైల్వేస్టేషన్ మధ్య పర్వాలేదు. ఇప్పటికే దాదాపు 150కిలోమీటర్ల పరిధిలోని రైల్వేఅండర్ క్రాసింగ్, వంతెనలు ఉన్నచోట అండర్ పాసేజ్లు నిర్మించారు. ఎచ్చెర్ల, ఆమదాలవలస, టెక్కలి, పలాస నియోజకవర్గంలోని కొంత భాగంలో అండర్ పాసేజ్లు, అండర్ టన్నెల్ నిర్మాణాలు ఎప్పుడో జరిగిపోయాయి. అక్కడ రైల్వేట్రాక్కు ఇరువైపులా ఉండే పొలాల నుంచి వ్యవసాయ ఉత్పత్తులు తరలించే వీలుగా ఏర్పాట్లు చేశారు. జిల్లా సరిహద్దు నుంచి ఉన్న జి.సిగడాం, పొందూరు, శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస), ఉర్లాం, తిలారు, హరిశ్చంద్రపురం, కోటబొమ్మాళి, నౌపడ, పూండి, పలాస రోడ్ల పరిధిలో అండర్ టన్నెల్, పాసేజ్ల నిర్మాణం పూర్తయింది.
స్తంభాలతో క్లోజ్..
ప్రస్తుతం పలాస రైల్వేస్టేషన్ నుంచి ఇచ్ఛాపురం రైల్వేస్టేన్ మధ్య 45కిలోమీటర్ల పరిధిలో రైల్వేట్రాక్కు ఇరువైపులా స్తంభాలను పాతుతున్నారు. కల్వర్టులు, వంతెనలు ఉన్నచోట సైతం స్తంభాలు పాతుతుండడంతో రైల్వేట్రాక్ అవతలి వైపు భూములు ఉన్న రైతులు ఆందోళన చెందుతున్నారు. పలాస నుంచి జి.సిగడాం రైల్వేస్టేషన్ల మధ్య అండర్ టన్నెల్, పాసేజ్ల మాదిరిగా ఇక్కడ కూడా నిర్మాణాలు చేపట్టాలని పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల ప్రజలు కోరుతున్నారు. దీనిపై ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఎన్నిసార్లు వినతులు అందజేసినా ఫలితం లేకపోతోందని వాపోతున్నారు. ఇప్పటికేనా ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడు, ఇచ్ఛాపురం, పలాస ఎమ్మెల్యేలు డాక్టర్ బెందాళం అశోక్, గౌతు శిరీష ప్రత్యేక చొరవ చూపించాలని కోరుతున్నారు. లేదంటే తమతో పాటు భూములపై హక్కుల పొందే భవిష్యత్ తరాలకు రవాణా కష్టాలు తప్పవని భావిస్తున్నారు.
కేంద్రం దృష్టికి సమస్య..
ఇచ్ఛాపురం నియోజకవర్గంలో సోంపేట, కంచిలి, ఇచ్ఛాపురం మండలాల్లో రైల్వేట్రాక్ ఉంది. ప్రస్తుతం ట్రాక్కు ఇరువైపులా స్తంభాలు పాతుతున్నారు. దీంతో ట్రాక్ అవతలవైపు ఉన్న రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యను కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడుతోపాటు ఉన్నతాధికారులకు నివేదించాం. సమస్యకు పరిష్కార మార్గం దొరుకుతుందనే ఆశాభావంతో ఉన్నాం.
- డాక్టర్ బెందాళం అశోక్, ప్రభుత్వ విప్, ఇచ్ఛాపురం
సాగుపైనే ఆధారం
దశాబ్దాలుగా సాగుపై ఆధారపడి బతుకుతున్నాం. రైల్వేట్రాక్ను దాటుకొని వ్యవసాయ పనులు చేస్తున్నాం. రైల్వే వంతెనల కింద నుంచి వ్యవసాయ ఉత్పత్తులు తీసుకుంటూ వస్తున్నాం. కానీ ఇప్పుడు ట్రాక్కు ఇరువైపులా స్తంభాలు పాతుతుండడంతో ఇబ్బందులు పడుతున్నాం.
- కె.జగన్నాయకులు, రైతు, సోంపేట మండలం