ఇంధనం పొదుపు.. భావితరాలకు వెలుగు
ABN , Publish Date - Dec 16 , 2025 | 12:10 AM
Fuel Saving Week celebrations ఒక యూనిట్ విద్యుత్ పొదుపు.. రెండు యూనిట్ల ఉత్పత్తితో సమానం. ప్రతి ఒక్కరూ ఇంధనం పొదుపు చేసి.. భావితరాలకు వెలుగునిద్దామ’ని ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి పేర్కొన్నారు.
ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి
పాత శ్రీకాకుళం, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): ‘ఒక యూనిట్ విద్యుత్ పొదుపు.. రెండు యూనిట్ల ఉత్పత్తితో సమానం. ప్రతి ఒక్కరూ ఇంధనం పొదుపు చేసి.. భావితరాలకు వెలుగునిద్దామ’ని ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి పేర్కొన్నారు. సోమవారం ఇంధన పొదుపు వారోత్సవాలు ప్రారంభంలో భాగంగా జిల్లాపరిషత్ కార్యాలయం నుంచి శ్రీకాకుళం కార్పొరేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ‘విద్యుత్ పొదుపు మనందరి సామాజిక బాధ్యత. విద్యుత్ను ఆదా చేస్తే.. విద్యుత్ను ఉత్పత్తి చేసినట్టే. సంప్రదాయేతర ఇంధన వనరులు వినియోగిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం’ అని నినాదాలతో పిలుపునిచ్చారు. ఎస్ఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ... ‘విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 20 వరకు ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహిస్తాం. విద్యుత్ వినియోగం పెరుగుతోంది. భవిష్యత్ అవసరాలు దృష్ట్యా విద్యుత్ను ఆదా చేయాలి. ఇంధన పొదుపుపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తామ’ని తెలిపారు. సౌర విద్యుత్ వినియోగంతో కాలుష్య నివారణ సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, ఈఈలు సురేష్ కుమార్, పి.యోగేశ్వరరావు, డీఈఈ సీహెచ్ వెంకటేశ్వరరావు, ఏఈఈ సురేష్ కుమార్, కె.రాము, విద్యుత్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.