పెండింగ్ ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేయాలి
ABN , Publish Date - Jul 08 , 2025 | 12:21 AM
రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కోరారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
అరసవల్లి, జూలై 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కోరారు. అరబిందో కార్మికుల పోరాటంలో నమోదైన కేసులో ఆయన సోమవారం శ్రీకాకుళం న్యాయ స్థానంలో హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి అధ్వానంగా ఉందని, నిధుల కేటాయింపు కూడా పెద్దగా లేదని అన్నారు. శ్రీకాకుళంలోని నేరడి ప్రాజెక్ట్ను పక్క రాష్ట్రం ఒడిశాతో సమస్యలను పరిష్కరించుకుని పూర్తి చేయాలన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే ఊరుకునేది లేదని అన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసిన తరువాతనే కొత్త ప్రాజెక్టులను చేపట్టాలని డిమాండ్ చేశారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి చేసిందేమీ లేదని అన్నారు. ఎయిర్ పోర్టుల నిర్మాణంలో నిర్వాసితులకు న్యాయం చేయడంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యార న్నారు. బలవంతపు భూసేకరణను సీపీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు.