organ donation: వివాహ వేదిక సాక్షిగా..
ABN , Publish Date - May 16 , 2025 | 12:04 AM
Couple's .. Organ Donor Awareness తాళికట్టు శుభవేళ.. ఆ నవ దంపతులు సమాజంలో నలుగురికీ ఆదర్శంగా ఉండేలా ఓ నిర్ణయం తీసుకున్నారు. తమ మరణానంతరం అవయవ దానానికి అంగీకరిస్తున్నట్టు వివాహ వేదిక సాక్షిగా ప్రకటించారు.
అవయవ దానానికి నవదంపతుల అంగీకారం
వీరి బాటలో మరో 60 మంది ముందుకు...
ఎచ్చెర్ల, మే 15(ఆంధ్రజ్యోతి): తాళికట్టు శుభవేళ.. ఆ నవ దంపతులు సమాజంలో నలుగురికీ ఆదర్శంగా ఉండేలా ఓ నిర్ణయం తీసుకున్నారు. తమ మరణానంతరం అవయవ దానానికి అంగీకరిస్తున్నట్టు వివాహ వేదిక సాక్షిగా ప్రకటించారు. అంతేకాదు... మరికొంత మంది ఈ బృహత్తర కార్యక్రమంలో పాల్గొనేలా స్ఫూర్తినింపారు. వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లా పత్తికాయవలస గ్రామానికి చెందిన బాలి శ్రీనివాసులు నాయుడుకు, శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం కేశవరాయునిపాలెం గ్రామానికి చెందిన ప్రియాంకతో ఎచ్చెర్ల మండలం మెట్టపేటకు సమీపంలోని ఓ కల్యాణ మండపంలో గురువారం వివాహం జరిగింది. ఈ పెళ్లి వేదిక నుంచే నూతన దంపతులతో పాటు వారి స్నేహితులు, బంధువులు 60 మంది ముందుకువచ్చి అవయవ దానానికి అంగీకరించారు. ఈమేరకు విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన మానవీయతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు బీవీ గోవిందరాజులుకు అంగీకార పత్రాలను అందించారు.