Share News

ఒకరి సొమ్ము మరొకరి ఖాతాలోకి..

ABN , Publish Date - Jun 25 , 2025 | 11:57 PM

ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన తల్లికి వందనం పథకం డబ్బులు ఒకరి ఖాతాకు బదులు మరొకరి ఖాతాకు జమైన ఘటనలు జిల్లాలో వెలుగుచూస్తున్నాయి.

 ఒకరి సొమ్ము మరొకరి ఖాతాలోకి..
పాగోడుకు చెందిన లీలాప్రసాద్‌కు ‘తల్లికి వందనం’ సొమ్మును అందజేస్తున్న సచివాలయ ఉద్యోగి

- ‘తల్లికివందనం’లో లోటుపాట్లు

- దిద్దుబాటు చర్యలు చేపడుతున్న అధికారులు

-అసలైన లబ్ధిదారులకు నగదు అందజేస్తున్న వైనం

- నరసన్నపేట మండలం ముద్దాడపేటకు చెంది న ముద్దాడ పెంటమ్మకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కానీ, తల్లికి వందన పథకం కింద ముగ్గురు పిల్లలకు సంబంధించిన డబ్బులు రూ.39వేలు ఆమె బ్యాంకు ఖాతాకు జమయ్యాయి. జలుమూరు మండలం పాగోడు గ్రామానికి చెందిన నేతింటి లీలా ప్రసాద్‌కు చెందిన ఆధార్‌ నెంబర్‌ను పాఠశాలలో తప్పుగా నమోదు చేయడంతో ఆ బాలుడికి చెందిన ‘తల్లికివందనం’ సొమ్ము పెంటమ్మ ఖాతాలో జమైనట్లు అధికారులు గుర్తించారు. దీంతో పెంటమ్మ నుంచి రూ.13 వేలు తీసుకొని లీలా ప్రసాద్‌కు అందించారు.

- గెడ్డవానిపేటకు చెందిన రావాడ లక్ష్మికి ఇద్దరు పిల్లలు. కానీ ఆమె బ్యాంకు ఖాతాలో ముగ్గురు పిల్లలకు చెందిన ‘తల్లికి వందనం’ నగదు జమ అయింది. బసివలస గ్రామానికి చెందిన చల్ల హేమశ్రీకి చెందిన రూ.13వేలు లక్ష్మి ఖాతాలో జమైనట్లు అధికారులు గుర్తించారు. ఇలాంటి పరిస్థితి జిల్లాలో చాలాచోట్ల నెలకొంది. ఆ వివరాలను అధికారులు ఆరా తీసి అసలైన తల్లుల ఖాతాలకు నగదు సర్దుబాటు చేస్తున్నారు.

నరసన్నపేట, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన తల్లికి వందనం పథకం డబ్బులు ఒకరి ఖాతాకు బదులు మరొకరి ఖాతాకు జమైన ఘటనలు జిల్లాలో వెలుగుచూస్తున్నాయి. పాఠశాలల్లో విద్యార్థుల ఆధార్‌ నెంబరును తప్పుగా నమోదు చేయడంతో ఈ పరిస్థితి నెలకొంది. అసలైన లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమైనట్లు సచివాలయాల రికార్డుల్లో చూపిస్తున్నా ఆ డబ్బులు మాత్రం వారి అకౌంట్లలో పడలేదు. దీంతో సంబంధిత తల్లులు ఆందోళనకు గురికావడంతో అధికారులు ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకొని దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారు. పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల సమయంలో తల్లులు ఆధార్‌ సీడింగ్‌ చేసేటప్పుడు నెంబర్లు తప్పుగా నమోదు చేయడం, బ్యాంకుల్లో కూడా ఆధార్‌ నెంబర్లు తప్పుడు సీడింగ్‌ కావడం వల్ల ఒకరి డబ్బులు మరొకరి ఖాతాలకు జమైయ్యాయని అధికారులు చెబుతున్నారు. ఎక్కడ పొరపాటు జరిగిందో గ్రహించి చర్యలు చేపట్టాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సచివాలయ సిబ్బంది క్షేత్రస్థాయిలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి అసలైన లబ్ధిదారులను గుర్తించి వారికి నగదు అందేలా చర్యలు చేపడుతున్నారు.

Updated Date - Jun 25 , 2025 | 11:57 PM