తాళ్లవలసలో డయేరియా కేసులపై
ABN , Publish Date - Dec 02 , 2025 | 12:27 AM
సంతబొమ్మాళి మండలం తాళ్లవలస గ్రామంలో డయేరియా కేసుల నమోదు కావడంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరా తీశారు.
సీఎం చంద్రబాబు ఆరా
వృద్ధుడి మృతికి కిడ్నీ సమస్యతోపాటు మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణమని తెలిపిన వైద్యఆరోగ్యశాఖ
శ్రీకాకుళం, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): సంతబొమ్మాళి మండలం తాళ్లవలస గ్రామంలో డయేరియా కేసుల నమోదు కావడంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరా తీశారు. ఈ మేరకు గ్రామంలోని పరిస్థితిని సీఎంకు వైద్యఆరోగ్యశాఖ అధికారులు వివరించారు. తాళ్లవసలలో శనివారం రాత్రి, ఆదివారం ఉదయం వరకు ఆరుగురు వ్యక్తులు అస్వస్థతకు గురికాగా వారిని టెక్కలి ఆసుపత్రికి తరలించామని చెప్పారు. సోమవారం మరో ముగ్గురు ఆసుపత్రిలో చేరారని సీఎంకు వివరించారు. బాధితులంతా వేర్వేరు కుటుంబాలకు చెందినవారని, ప్రస్తుతం ఆసుపత్రిలో ఐదుగురు చికిత్స పొందుతూ కోలుకుంటున్నారని, ముగ్గురు డిశ్చార్జి అయ్యారని తెలియజేశారు. అయితే చిన్నారావు(70) అనే వృద్ధుడు చికిత్స పొందుతూ ఆదివారం మరణించారని తెలిపారు. చిన్నారావు మృతికి డయేరియా కారణం కాదని వైద్యఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు. ఆయ మూత్రపిండాల వ్యాధితో బాధపడేవారని. మల్టీఆర్గాన్ డిస్ ఫంక్షన్ వల్ల గుండెపోటు వచ్చి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించాని తెలిపారు. గ్రామంలో ఉన్న ఒక బావి ద్వారా ఐదు పబ్లిక్ కొళాయిలకు నీరు సరఫరా అవుతోందన్నారు. ఈ నీటిని ఆర్డబ్ల్యుఎస్ ద్వారా పరీక్షించగా ఎక్కడా కలుషితం లేదని, నీరు తాగడానికి సురక్షితమేనని తేలిందని స్పష్టం చేశారు. అయినా ముందుజాగ్రత్త చర్యగా బావి నుంచి నీటి సరఫరా నిలిపివేశామన్నారు. ప్రస్తుతం ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు ముఖ్యమంత్రికి వివరించారు. జిల్లా పంచాయతీ అధికారి, ఆర్డబ్ల్యుఎస్ ఎస్ఈ క్షేత్రస్థాయిలోనే ఉండి పారిశుధ్యం, నీటి సరఫరాను పర్యవేక్షిస్తున్నారన్నారు. డయేరియా ప్రబలడానికి కారణాన్ని కనుగొనేందుకు డిప్యూటీ డీఎంహెచ్వో, ఏపీడెమియాలజిస్ట్ గ్రామంలో ఉండి పరిశీలిస్తున్నారని తెలిపారు. వైద్య బృందాలు ఇంటింటికీ వెళ్లి పరీక్షలు నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. తాళ్లవసల గ్రామస్థులు ఎందుకు అనారోగ్యం పాలవుతున్నారో గుర్తించాలని సీఎం ఆదేశించారు. నీటిలో ఎక్కడైనా మలినాలు కలుస్తున్నాయా..? లేక ఇతర కారణాలా..? అనేది విశ్లేషించాలని సూచించారు. గ్రామస్థులందరికీ సురక్షితమైన నీరు అందించేలా చర్యలు తీసుకోవడంతోపాటు సమీప గ్రామాలపైనా దృష్టి సారించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కాగా తాళ్లవలసలో డయేరియాపై మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఆరా తీశారు. వైద్యబృందాలు గ్రామానికి వెళ్లాలని సూచించారు.